AP Cabinet Reshuffle: మంత్రులను బలిచేస్తే.. జగన్ కు అధికారం సాధ్యమేనా?

AP Cabinet Reshuffle: సమర్థత, అసమర్థత, విధేయత, స్వామిభక్తి..ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్న అంశాలివి. ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన పర్యవసనాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎవరికీ అంతుపట్టనట్టుగా ఉంటున్నాయి. అసలు సీఎం జగన్ మనసులో ఏముంది? అసలేం చేయబోతున్నారు? ఎందుకిలా వ్యవహరిస్తున్నారు? అని అధికార పార్టీ నాయకులు హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. సమర్థులైన మంత్రులను తెచ్చుకోవడానికి ప్రక్షాళన అంటూ కొత్త పల్లవి అందుకోవడంతో సీఎం అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇన్నాళ్లు పదవులు వెలగబెట్టిన […]

Written By: Admin, Updated On : April 8, 2022 10:21 am
Follow us on

AP Cabinet Reshuffle: సమర్థత, అసమర్థత, విధేయత, స్వామిభక్తి..ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్న అంశాలివి. ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన పర్యవసనాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎవరికీ అంతుపట్టనట్టుగా ఉంటున్నాయి. అసలు సీఎం జగన్ మనసులో ఏముంది? అసలేం చేయబోతున్నారు? ఎందుకిలా వ్యవహరిస్తున్నారు? అని అధికార పార్టీ నాయకులు హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. సమర్థులైన మంత్రులను తెచ్చుకోవడానికి ప్రక్షాళన అంటూ కొత్త పల్లవి అందుకోవడంతో సీఎం అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇన్నాళ్లు పదవులు వెలగబెట్టిన వారు అసమర్థులా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజకీయ వ్యూహాంలో భాగంగా తాజా మాజీ మంత్రులు సమిధులవుతుండగా.. ఆశావహులు కూడా పదవి బాధ్యతలు చేపట్టేందుకు జంకుతున్నారు. ఒక సీఎం, ఐదుగురు డిప్యూటీ సీఎంలు, 25 మంది అమాత్యులు.. ఇదీ ఏపీ కేబినెట్ స్వరూపం.

AP Cabinet Reshuffle

అటువంటిది ఉన్నట్టుండి మంత్రివర్గాన్ని డిజాల్వ్ చేసి..దానికి ‘అసమర్థత’ అన్న పేరు పెట్టడాన్ని తాజా మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అసమర్థత అనే వ్యాఖ్యలను తమ సహచరుడైన తాజా మాజీతో చెప్పించడం ద్వారా కూడా కొత్త వ్యూహానికి తెరతీశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసమర్థతను ప్రామాణికంగా తీసుకుంటే సీఎం జగన్ జాబితాలో ప్రథమంగా నిలుస్తారు. అవశేష ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టులో పురోగతి లేదు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు తెప్పించుకోలేకపోయారు. ప్రజలను అప్పుల ఊబిలో నిలబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో అన్నీ ‘అసమర్థ’అంశాలే కనిపిస్తాయి. అటువంటప్పుడు తాను తప్పుకొని సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయవచ్చు కదా. కానీ ఆ పనిచేయకుండా సంక్షేమ పథకాల ద్వారా వచ్చే రాజకీయ మైలేజ్ ను తాను అనుభవిస్తూ.. మంత్రులను బలిచేయడం తగునా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Also Read: Maarisetty Raghavaiah: జనసేన వ్యూహకర్త మారిశెట్టి రాఘవయ్య బీజేపీ లో చేరిక!

నాడే డమ్మీ కేబినెట్ తో..
తిరుగులేని మెజార్టీతో సీఎంగా ప్రమాణం చేసిన జగన్ కేబినెట్ కూర్పులోనే జాగ్రత్త పడ్డారు. సీనియర్లను కాదని జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. వీలుకాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి ఒకరిద్దరికి అవకాశాలిచ్చారు. వారిని కూడా వారి శాఖలకు, వారి సొంత నియోజకవర్గాలకే పరిమితం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి, అవశేష ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పేవలమైన డమ్మీ కేబినెట్ ను రూపొందించి.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పాలించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శాఖాపరమైన నిర్ణయాలు ప్రకటించేటప్పుడు సైతం తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్ర్కిప్ట్ చదవాల్సిందే. విలేఖర్ల సమావేశంలో తాము రాసిచ్చిన పేపర్లో కాదని ఒక ముక్క అదనంగా చదవొద్దని ఆదేశాలిచ్చేవారు. కొవిడ్ కల్లోలం స్రుష్టిస్తున్న వేళ.. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. పది, ఇంటర్ వంటి పరీక్షలను రద్దు చేశాయి. ఆ సమయంలో సొంత నియోజకవర్గంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేసేది లేదంటూ ప్రకటించారు. ఆ తరువాత రోజు ఆయనను అమరావతికి అర్జెంట్ గా రప్పించి చేతిలో పేపర్ పెట్టారు. అప్పుడే ఆయనకు అర్ధమైంది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రులను డమ్మీ చేశారనడానికి ఇది ఒక మచ్చు ఉదాహరణ మాత్రమే.

సైలెంట్ వెనుక
సీనియర్ మంత్రలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు ప్రారంభంలో కొద్దిపాటి హడావుడి చేశారు. పరిస్థితి చూసి సైలెంట్ అయిపోయారు. తొలి ఏడాదిలో ఇసుక పాలసీలపై పెద్దిరెడ్డి ఉన్నతాధికారులతో రివ్యూ చేసేవారు. సలహాలు, సూచనలు ఇచ్చేవారు. కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి తగ్గండి అన్న ఆదేశాలు రావడంతో సమీక్షలు, సమావేశాల జోలికి వెళ్లడం మానేశారు. కీలకమైన హోం మంత్రిత్వ శాఖను దళిత మహిళ మేకతోటి సుచరితకు అప్పగించారు. కానీ ఏనాడు ఆమె శాంతిభద్రతలపై సమీక్షించింది లేదు. కేవలం బుగ్గ కారుపై తిరగడానికే పరిమితమయ్యారు. చివరకు దిశ యాప్ ఆవిష్కరణ సమయంలో కూడా కనిపించలేదు. రాష్ట్ర డీజీపికి ఇచ్చిన స్వేచ్ఛ సైతం ఆమెకు ఇవ్వలేదు. కనీసం శాఖపై కూడా ఆమెకు కనీస అవగాహన లేదు. పిట్ట కథలు చెప్పి మెస్మరైజ్ చేసే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాను నిర్వర్తిస్తున్న కీలక ఆర్థిక శాఖకు న్యాయం చేసిన పాపాన పోలేదు. ప్రతీ పక్షం రోజులకు ఢిల్లీకి అప్పలకు, అప్పుల అనుమతికి చక్కెర్లు కొట్టే ఆయన గల్లా పెట్టే ఖాళీ అయ్యిందని.. ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోందని.. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నామని చెప్పే సహసం చేయలేదు. ఆర్థిక శాఖను గాడిలో పెట్టే ప్రయత్నమూ చేయలేదు. మంత్రులంతా తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు కాకుండా ‘సమర్థంగా’ పనిచేసి ఉన్నా.. శాఖలపై పట్టు సాధించి ఉన్నా తమ కెరీర్ లో ఈ మూడు సంవత్సరాలు కొంత సంత్రుప్తినిచ్చేవి. కానీ పేరుకే మంత్రులం…పెత్తనం తాడేపల్లి ప్యాలెస్ ది అటువంటప్పుడు ఈ మంత్రి పదవులు ఉండడం కంటే ఊడడమే మేలని వారు ఆత్మ సంత్రుప్తి పరచుకుంటున్నారు.

AP Cabinet Reshuffle

తెరపైకి ‘అసమర్థత’
మా సీఎం ఏం చేసినా ఆలోచించే చేస్తారు..ప్రజల కోసమే చేస్తారు అనడం మంచిదే కానీ.. సమర్థుల కోసమే మంత్రివర్గ ప్రక్షాళన అంటూ మన బాషా ప్రావిణ్యంతో ఆకట్టుకునే తాజా మాజీ కొడాలి నానిగారు సెలవిచ్చారు. కొనసాగింపు జాబితాలో ఆయన పేరుంటే సమర్థుడు. తొలగింపులో ఉంటే అసమర్ధుడుగా ఆయన మిగిలిపోతారు. మంచిదే ఆయనా దేనికైనా సిద్ధమే. కండబలం, గుండెబలం..ఆపై నోటి బలం ఆయన సొంతం. కానీ సమర్థత అన్న మాట ఆయన నోటి నుంచి రావడాన్నే సహచరులైన మాజీలు జర్ణించుకోలేకపోతున్నారు. అది తమ పార్టీ అధినేత, సీఎం జగన్ మాటగా భావిస్తున్నారు. ఎందుకంటే కొడాలి నాని నోటి నుంచి వచ్చే ప్రతీ మాట తాడేపల్లి ప్యాలెస్ వే అన్న భావన రాష్ట్ర ప్రజలతో పాటు అతి దగ్గర నుంచి చూశారు కనుక వారి ప్రగాడ నమ్మకం. చంద్రబాబు, లోకేష్, విపక్ష నేతలను తిట్టాలంటే కొడాలి నాని ఎక్కడ? అన్న మాట వినబడుతోంది. రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ఆయనకు ఆదేశాలు అందుతాయి. మోస్తరుగా తిట్టండి, బాగా తిట్టండి, ఇంకొంచెం డోసు పెంచండి అంటూ వచ్చే ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తారు మన బూతుల మంత్రి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకు సంబంధించి వివరాలు తెలపడం కంటే ఆయన విపక్ష నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేవలం పార్టీ విధానాలు, అధినేత ఇచ్చిన టాస్కుపైనే ద్రుష్టి పెడతారు. అటువంటి కొడాలి నానియే చెప్పాక తమను ప్రజల్లో అసమర్థులుగా చూపే పక్కా ప్రణాళిక తమ అధినేత నుంచే వచ్చిందని తాజా మాజీలు తెగ బాధపడుతున్నారు. ఒకరిద్దరు అయితే వద్దండి ఈ రాజకీయాలు అంటూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.

నేలవిడిచి సాము
అయితే పరిస్థితి ఎల్లవేళలా ఒకలా ఉండదన్న సూత్రం సీఎం జగన్ కు పట్టడం లేదు. నిత్యం తన చతురుత, వ్యూహం పనిచేస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ప్రజలు చాలా తెలివైన వారు అన్నది వాస్తవం. ఏం జరుగుతుందో తెలియని అమాయకులు కారు. సంక్షేమ పథకాల అమలుతో వచ్చే మైలేజ్ నాది.. శాఖపరమైన వైఫల్యాలు మంత్రులవి అనుకుంటే పొరబడినట్టే. నవరత్నాలు అంటూ వచ్చాక ఏ శాఖ ప్రగతి ఏముందో తెలియంది కాదు. తనను చూసి ఓటేస్తారన్న భ్రమలో సీఎం ఉండవచ్చు.. కానీ తమ భవిష్యత్ కు ఇబ్బందులు తప్పవని ప్రజలు భావిస్తే మాత్రం జగన్ కు ప్రమాద ఘంటికలే. పైగా సమర్థత, అసమర్థత అన్న మాటలు ఆయనకు సూటవ్వవని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మా నాయకుడు తోపు, మా నాయకుడు బాహుబలి, మా నాయకుడు అది..ఇదీ అంటూ మూడేళ్లు హడావుడి చేసిన తాజా మాజీలకు తత్వం బోధపడింది. కానీ మాకు పదవులతో పనిలేదు. ఆయన సైనికులం. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామంటూ ఇప్పటికీ కొందరు స్వామిభక్తి చాటుతునే ఉన్నారు. ఇంకా రెండేళ్ల ఎమ్మెల్యే పదవీకాలం.. అటు తరువాత మారే రాజకీయ సమీకరణల వరకైనా మేనేజ్ చేసుకొద్దామన్న ఆరాటంలో భాగమే స్వామిభక్తి అని.. ఇంత జరిగాక కూడా నమ్ముతామా అంటూ అంతర్గత సమావేశాలు, తాజా మాజీల వద్ద వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Also Read: CM Jagan: తాజా మాజీ మంత్రులకు జగన్ బంపర్ ఆఫర్

Tags