
ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం లేదు.. కానీ ప్రజల నాడి తెలుసుకున్న నేత ఆయన. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. సంక్షేమ పథకాలను పరుగుపెట్టిస్తున్న గొప్ప పాలనాదక్షకుడు. అందుకే ఆయనకు అవార్డులు కూడా దాసోహం అంటున్నాయి. ఆయనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనదైన పాలనతో దేశవ్యాప్తంగా ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టులను ఏడాది పాటు సంపూర్ణంగా అధ్యయనం చేసిన స్కోచ్ అనే సంస్థ.. ఆయనను సీఎం ఆఫ్ ది ఇయర్గా ప్రకటించేసింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచనలను జగన్ చేశారని వెల్లడించింది. ఆ మేరకు ప్రకటన చేసింది. అవార్డును స్కోచ్ సంస్థ చైర్మన్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చి అందజేశారు. సీఎం జగన్ ఆ పురస్కారానికి చిరునవ్వుతో స్వాగతించారు. తమ కష్టాన్ని గుర్తించిన స్కోచ్కు కృతజ్ఞతలు తెలిపారు.
స్కోచ్ సంస్థ అవార్డులు ఇవ్వడంలో ప్రసిద్ధి. ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలకు అవార్డులు ఇస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకూ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డును మాత్రం ప్రకటించలేదు. దీనికి కారణం ఏడాది మొత్తం సీఎం పనితీరును మదింపు చేయాల్సి ఉండటమే. ఆ కసరత్తును సుదీర్ఘంగా నిర్వహించిన స్కోచ్ పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లుగా తేల్చింది. ఏపీలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా స్కోచ్ అధ్యయనం చేసింది. రైతు భరోసా కేంద్రాలు, చేయూత, అనుసంధాన రుణాలు వంటివి ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తెస్తున్నాయని స్కోచ్ చెబుతోంది. దిశ, అభయ పథకాల ద్వారా మహిళల్లో భరోసా పెరిగి గణనీయమైన మార్పులు తెచ్చిందని స్కోచ్ ప్రకటించింది.
కరోనా టైమ్లోనూ జగన్ ఎంతో ఆలోచనతో ముందుకు వెళ్లారు. ఏ రాష్ట్రం చేయని విధంగా లక్షల సంఖ్యలో టెస్టులు చేయిస్తూ.. కేసులు ట్రెయిస్ ఔట్ చేశారు. దాని కారణంగా కరోనాను కట్టడి చేయగలిగారు. పాలనను పారదర్శకంగా.. సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రెండేళ్లలో రాష్ట్రంలో పలు విప్లవాత్మక చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే.. స్కోచ్ సంస్థకు ఇంటికి వచ్చి మరీ అవార్డును అందించింది. సాధారణంగా స్కోచ్ సంస్థ ఢిల్లీలో పెద్ద పెద్ద కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. కానీ.. ఈ సారి అవార్డులు పొందిన వారికి ఇంటికి వెళ్లి ఇస్తూ వస్తోంది.