ఆర్థికంగా, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇజ్రాయిల్ కెపాసిటీ ఏంటన్నది ప్రపంచానికి తెలిసిందే. అయితే.. రాజకీయంగా మాత్రం ఆ దేశం అస్థిరతకు మారుపేరు అన్నట్టుగా తయారైంది. కేవలం రెండు సంవత్సరాల్లో ఆ దేశంలో ఏకంగా నాలుగు సార్లు ఎన్నికల జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా.. ఈ ఏడాది మార్చి 23న నాలుగోసారి ఎన్నికలు జరిగాయి.
120 స్థానాలు గల ఆ దేశ పార్లమెంటులో.. ప్రదాని బెంజిమన్ నెతన్యాహూ నాయకత్వంలోని ‘లికుడ్’ పార్టీ 60 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఒకే ఒక్క సీటు తక్కువగా ఉండడంతో అధికారం చేపట్టలేకపోయింది. ఇతర పార్టీలను కలుపుకుందామని ప్రయత్నించినా కుదరలేదు.
ఈ కీలక సమయంలో విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని స్థాపించాయి. దీంతో.. అనివార్యంగా నెతన్యాహూ వైదొలగాల్సి వచ్చింది. మొత్తం ఎనిమిది పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కొన్ని సార్లు కింగుల కన్నా.. కింగు మేకర్లు శిఖరం మీద కూర్చుంటారు కదా.. ఇక్కడకూడా అదే పరిస్థితి వచ్చింది. కేవలం ఏడు గురు సభ్యులున్న ‘యమినా’ పార్టీ నాయకుడు నాఫ్తాలీ బెన్నెట్ ప్రధాని పదవి దక్కించుకోవడం విశేషం.
నాఫ్తాలీ బెన్నెట్ ప్రధాని పదవిలో రెండేళ్లు కొనసాగుతారు. ఆ తర్వాత సెంట్రిస్ట్ యేష్ అతిద్ పార్టీ నాయకుడు ఎయిర్ లాడ్ మరో రెండేళ్లపాటు ప్రధాని పదవి చేపట్టేలా ఒప్పందం కుదిరింది. అయితే.. ఎనిమిది పార్టీల జెండాలను కలిపి కుట్టిన ఈ సర్కారు జెండా.. ఎంత కాలం ఎగురుతుందనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇప్పటికే నాలుగు సార్లు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ పొత్తు పూర్తికాలం కొనసాగడం అనుమానమేనని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు.. ప్రధాని పదవి పంచుకుంటున్న ఇద్దరు కూడా పాలస్తీనా వ్యతిరేకులే. ఇటీవల రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.