KCR- Jagan: చంద్రబాబు అరెస్టు వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం ఉందా? జగన్తో కలిసి బిజెపి సహకారంతో ఈ పని చేయగలిగారా? తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ రగిల్చి గట్టెక్కాలని భావిస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్టుపై బి ఆర్ ఎస్ నేతలు ఒకవైపు వ్యక్తిగతంగా స్పందిస్తుండగా.. మరోవైపు హైదరాబాదులో ఆందోళనలు, నిరసనలు చేపట్టడానికి వీలులేదని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇలా బి ఆర్ ఎస్ నుంచి విభిన్న ప్రకటనలు వస్తుండడం వ్యూహాత్మకమని తేలుతోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నిశితంగా పరిశీలిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓపెన్ అయ్యారు.
చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత మంత్రి కేటీఆర్ కీలక ట్విట్ పెట్టారు. జగన్ను అభినందించేలా ఆ ట్విట్ ఉంది. అటు తరువాత బి.ఆర్.ఎస్ నేతలు ఎవ్వరూ స్పందించలేదు. చంద్రబాబు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ వంటి వారు స్పందించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏకంగా ఐటి ఉద్యోగులు చేపట్టిన ఆందోళన లో పాల్గొన్నారు. అయితే రాజధానిలో సెటిలర్స్, ఐటీ ఉద్యోగుల ప్రభావం ఉన్న నేపథ్యంలో బి ఆర్ ఎస్ హై కమాండ్ వారికి వ్యక్తిగతంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అనుమతి ఇచ్చి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి.
అయితే హైదరాబాద్లో ఆందోళనలో చేయడానికి వీలు లేదని.. ఏపీ రాజకీయ కాలుష్యం తెలంగాణలో విడిచిపెడతామంటే ఒప్పుకోమంటు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఈ తరుణంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించవద్దని.. ఆందోళనలు చేయవద్దని కేటీఆర్ ప్రకటించడం ఏమిటని.. హైదరాబాద్ ఏమైనా మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ ట్రాప్ లో పడిందని టాక్ నడుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో చంద్రబాబును సాకుగా చూపే కెసిఆర్ సెంటిమెంట్ను రెచ్చగొట్టారు. మరోసారి అటువంటి వ్యూహానికి తెర తీశారా అన్న అనుమానం కలుగుతుంది. బిజెపి సైలెంట్ గా ఉండడంతో.. కాంగ్రెస్ పార్టీని ఈ అంశంలో ఇరికించేందుకు కెసిఆర్ పన్నాగం పన్నుతున్నారని అనుమానాలు వస్తున్నాయి. అయితే జాతీయ పార్టీగా మారిన బిఆర్ఎస్.. ఇంకా రాష్ట్ర భావాలతోనే ముందుకెళ్లడం.. 2004 నుంచి తెలంగాణకు దూరమైన చంద్రబాబును బూచిగా చూపించడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తో తెలంగాణ నేతలు స్పందిస్తున్న తీరుతో కేసిఆర్ కలవరపాటు గురవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చాలామంది టిడిపి నేతలు కార్యకర్తలు ఇప్పటి బి.ఆర్.ఎస్, అప్పటి టి ఆర్ ఎస్ లో చేరారు. ఇప్పటికీ వారికి చంద్రబాబు అంటే అభిమానం. రాజకీయ కారణాల దృష్ట్యా చాలామంది గులాబీ గూటికి చేరారు. చంద్రబాబుపై కక్షతోనే జగన్ జైల్లో పెట్టించారని వారంతా బలంగా భావిస్తున్నారు. అందుకే పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో స్పందించిన వారంతా పాత తెలుగుదేశం పార్టీ నేతలే. దీంతో కెసిఆర్ లో సైతం ఒక రకమైన భయం ఏర్పడింది. చంద్రబాబు గానీ రాజకీయంగా ఎదిగితే తనకు నష్టం తప్పదని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబును బలహీన పరచాలని జగన్ తో చేతులు కలిపినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబును సాకుగా చూపి సెంటిమెంట్ ను వర్కౌట్ చేసుకోవాలన్న యోచనలో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.