ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధం గురించే భారీస్థాయిలో చర్చ జరుగుతోంది. బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు ఈ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయం చేయాలని ప్రయత్నించాయి. ఈ పార్టీల నేతలు ఇళ్లల్లోనే నిరసన దీక్షలు చేసి రాష్ట్రంలో ఏదో జరుగుతోందనే విధంగా సంకేతాలను ఇచ్చే ప్రయత్నం చేశారు. సీబీఐకు కేసును అప్పగించాలని డిమాండ్ చేశారు.
అయితే జగన్ కేసును సీబీఐకు అప్పగించడంతో వాళ్ల నోళ్లన్నీ మూతబడ్డాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అంతర్వేది ఘటన గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మీడియా ప్రతినిధులు అంతర్వేది ఘటన గురించి స్పందించమని విజయసాయిరెడ్డిని కోరగా ఈ ఘటన వెనుక ఒక ప్రవాసాంధ్రుడు ఉన్నాడని ఆయన అన్నారు.
ఆ ప్రవాసాంధ్రుడి కుట్ర వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ఆ ప్రవాసాంధ్రుడు ఎవరో అనే గందరగోళానికి గురి కావద్దని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ఆ ప్రవాసాంధ్రుడు అని పేర్కొన్నారు. విజయసాయి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనమయ్యాయి. చంద్రబాబు అనుచరుల హస్తం ఉందని విజయసాయి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ లో ఉంటూ చంద్రబాబు ఏపీలో కుట్రలకు పాల్పడుతున్నారని… సీబీఐ దర్యాప్తులో చంద్రబాబే దోషిగా తేలుతుందని అన్నారు. అంతర్వేదిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందనే ప్రచారం చేయాలని పలువురు ప్రయత్నించారని…. ఈ ఘటనలో హైదరాబాద్, గుంటూరు వ్యక్తుల పాత్ర ఉందని గుర్తించామని అన్నారు.