India Russia strategic partnership: బలవంతుడు అక్రమాలకు పాల్పడుతుంటే.. దారుణాలకు తెగిస్తుంటే .. వాటిని భరించిన వారు.. ఓపిక నశించి తిరుగుబాట చేస్తే అప్పుడు పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఆ తర్వాత బలవంతుడు నిలబడేందుకు చోటు ఉండదు. చరిత్ర చెప్పిందిదే. ఇప్పటి వర్తమానం కూడా అదే చెబుతోంది. అమెరికాకు వ్యతిరేకంగా భారత్, రష్యా నిలుస్తున్న తీరు, చేయి కలిపిన తీరు పై ఉపోద్ఘాతానికి బలం చేకూర్చుతున్నాయి.
భారత్, రష్యా కు చుట్టూ శత్రు దేశాలు ఎక్కువ. అందుకే వైమానిక దళాలను బలోపేతం చేసేందుకు తాపత్రయపడుతున్నాయి. ఈక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు గొప్ప శుభవార్త చెప్పారు. అత్యాధునిక స్టెల్త్ సామర్థ్యమున్నసుఖోయ్ ఎస్ యూ 57 యుద్ధ విమానాలను మనదేశంలో రష్యా తీర్చిదిద్దబోతోంది. దీనికి మన సహకారం కూడా తీసుకోబోతోంది. కీలకమైన సాంకేతికతను పంచుకునేందుకు రష్యా తన సుముఖతను వ్యక్తం చేసింది.
మన దేశ వైమానిక దళంలో ఐదో తరానికి సంబంధించిన యుద్ధ విమానాలు లేవు. పాకిస్థాన్ దేశానికి చైనా షెన్ యాంగ్ జె 35 ఏఈ స్టెల్త్ ఫైటర్ విమానాన్ని ఇవ్వనుంది. ఈనేపథ్యంలోనే రష్యా భారత్ కు అపన్న హస్తం అందించింది. అంతేకాదు, రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలున్నాయని, డిఫెన్స్ రంగంలో ఎటువంటి పరిమితులు లేవని పుతిన్ పేర్కొనడం విశేషం. తద్వారా వెస్ట్రన్ కంట్రీస్ కు పుతిన్ సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. పాశ్చాత్య దేశాలు సాంకేతికతను ఇచ్చేందుకు అనేక రకాల కండీషన్లు పెడుతుంటాయి.
సు 57 అనే ఫైటర్ జెట్ ను డెవలప్ చేయడానికి రష్యా గతంలో ఆఫర్ ఇచ్చింది. 2018లో దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కారణాలు తెలియవు గాని అందులో నుంచి ఇండియా పక్కకు వెళ్లింది. సు 57 యుద్ధ విమానం ద్వారా భారత్ అవసరాలు తీరవని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిని ఐఏఎఫ్ నిర్ధారించింది. దీంతో భారత్ వెనక్కి వెళ్లకతప్పలేదు. భారత్ కూడా ఐదో తరం యుద్ద విమానాలను తయారు చేస్తోంది. వాటికి అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే పేరు పెట్టింది. మరో నాలుగు సంవత్సరాలలో ఇది సైన్యం లో చేరే అవకాశం ఉంది.
భారత్, రష్యా మధ్య ఐదో తరం యుద్ధ విమానాల గురించి చర్చలు దాటి, తయారీ వరకు అడుగులు పడుతున్ననేపథ్యంలో అమెరికా రోజూ ఈనో తాగాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
