లాక్ డౌన్ తో జీవనోపాధి కోల్పోయిన పేద వర్గాలకు గత నెల కేంద్రం ప్రకటించిన రూ 1.70 లక్షల కోట్ల ప్యాకేజి తరహాలో కార్పొరేట్ రంగం సహితం భారీ ప్యాకేజి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం వైపు చూస్తున్నది. ఈ విషయమై భారీ కోర్కెల చట్టాలను సహితం ప్రభుత్వానికి సమర్పించాయి.
అయితే కేంద్రం ఆ దిశలో ఆలోచనలు చేయడం లేదని తెలుస్తున్నది. లాక్డౌన్ కారణంగా మూతపడిన పరిశ్రమలను మళ్లీ తెరిపించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కార్పొరేట్ వర్గాలు ఎదురు చూస్తున్న భారీ ప్యాకేజీ లభించే అవకాశాలు లేవని తెలుస్తున్నది.
అమెరికా, ఐరోపా దేశాల మాదిరిగా మనదేశంలో భారీ ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావించటంలేదని, మధ్యస్థాయి ప్యాకేజీలు రూపొందించాలని భావిస్తున్నదని ఆర్థిక మంత్రికి ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దశలో విస్తృతమైన వనరులను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.
అయితే బ్యాంకుల నుండి రుణాల విషయంలో మాత్రం ఇప్పటికే కొంత వెసులుబాటు కల్పించింది. రుణాల చెల్లింపులో కొంత ఉదారంగా ఉండమని బ్యాంకు లకు సూచించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా దివాలా చట్టం (ఐబీసీ) నిబంధనలను కేంద్రం సవరిస్తున్నట్లు తెలిసింది.
ఒక ఏడాది వరకు ఈ చట్టం అమలును నిలుపుదల చేయాలని నిర్ణయించింది. దీంతో రుణ ఎగవేతదారులపై దివాలా ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడినట్లు కాగలదు. ఇందులో భాగంగానే సెక్షన్ 7, 9, 10 నిబంధనలను 6 నెలలపాటు సస్పెండ్ చేయనున్నట్లు చెబుతున్నారు.
ఈ మేరకు కేంద్రం ఓ ఆర్డినెన్స్ను జారీ చేయనుందని చెబుతున్నారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇందు కోసం నిర్ణయం కూడా తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.
ఐబీసీ నిబంధనల సవరణతో కార్పొరేట్లకు బ్యాంకులు రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకూ అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం తీసుకున్న రుణాలకు సంబంధించిన కిస్తీలను 90 రోజులకు మించి చెల్లించకపోయినైట్లెతే సదరు రుణగ్రహీతలను రుణదాతలు దివాలా ప్రక్రియకు లాగవచ్చు.