Chandrababu: గత ఐదేళ్లలో అమరావతి నిర్వీర్యం అయ్యింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ముచ్చట బయటపడింది. కానీ ఆ విషయంలో జగన్ సర్కార్ ముందడుగు వేయలేకపోయింది. ఇప్పటికీ ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అటు అమరావతిని పట్టించుకోకపోవడంతో కట్టడాలు పూర్తిగా పాడయ్యాయి. మూడు రాజధానుల నిర్ణయం అమరావతికి శాపంగా మారింది. అయితే అటు చంద్రబాబు సైతం అమరావతి నిర్మాణంలో కొన్ని రకాల లోపాలను అధిగమించలేకపోయారు. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న సంస్థల ప్రతినిధులు ఇప్పుడు.. సొంత దేశాల్లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా అందించారు. తనను చూసి రైతులు భూములు ఇచ్చారని చంద్రబాబు చెబుతున్నారు. అందులో వాస్తవం ఉంది కానీ.. అమరావతి నిర్మాణాల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు మాత్రం సరికావన్న విమర్శలు ఉన్నాయి.సింగపూర్ ప్రభుత్వమే నేరుగా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అయినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే సింగపూర్ కు చెందిన మూడు సంస్థలే అమరావతి నిర్మాణం చేపట్టాయని తరువాత తెలిసింది. అవకతవకలకు పాల్పడ్డారని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పై వేటు పడింది. ఆయన జైలుకు కూడా వెళ్లారు. నేరారోపణ రుజువైతే ఆయనకు జైలు జీవితం తప్పదు. అటువంటి వ్యక్తిని నమ్మి చంద్రబాబు అమరావతి నిర్మాణ బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తుంది.
అమరావతిలో టౌన్ షిప్ నిర్మాణానికి గాను ఆ నాలుగు సంస్థలకు 1600 ఎకరాలు కేటాయించారు. అందులో 200 ఎకరాలను ఆ సంస్థలే తీసుకోనున్నాయి. మిగతాది డెవలప్ చేసి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఇందులో సిఆర్డిఏకు సగభాగం మాత్రమే దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ టౌన్ షిప్ లో నిర్మాణాలను విక్రయించేందుకు మరో సంస్థను అడ్డగోలుగా సృష్టించారు. దాని బాధ్యతలను కూడా సింగపూర్ వ్యక్తికి అప్పగించారు. అయితే ఇందులో చంద్రబాబు తప్పిదం ఉందో.. లేదో కానీ.. ఈ సంస్థల్లో డొల్లతనం బయటపడటం మాత్రం బాబు వైఫల్యంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చంద్రబాబు లాంటి సీనియర్ నేత అమరావతి రాజధాని శాశ్విత నిర్మాణాల్లో చూపించిన చొరవ ఇదేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న సంస్థలు, వాటి ప్రతినిధులు చుట్టూ వివాదాలు, కేసులు అలుముకోవడం చంద్రబాబుకు మైనస్ గా మారింది. ఆయన చిత్తశుద్ధిని శంకిస్తోంది.