న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మొత్తం 16 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా లిఖిత పూర్వక వివరణ సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డి.రమేశ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు నోటీసులు జారీ చేసిన వారిలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), సీబీఐ డైరెక్టర్, విశాఖ సీబీఐ ఎస్పీ.. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ, సమాచార, సాంకేతిక (ఐటీ) శాఖ, సమాచార, ప్రసార శాఖ, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ.. జియో-రిలయన్స్ జియో సీఈవో, వొడాఫోన్-ఐడియా సీఈవో, ఎయిర్టెల్ సీఈవో, బీఎ్సఎన్ఎల్ సీఈవో, భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) చైర్మన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నారు.
Also Read : వీర్రాజు తో అంత వీజీ కాదని అర్థం చేసుకున్న ఏబిఎన్ ఆర్కే…!
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్పై వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనం ఆధారంగా విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రేస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు కళంకం తెచ్చేలా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్, ట్రేసింగ్, నిఘా తదితరాలకు యత్నించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, డీజీపీల వ్యవహారంపై విచారణకు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అందులో అభ్యర్థించారు. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ను టెలిగ్రాఫ్ చట్టానికి, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రకటించాలని కూడా విన్నవించారు. ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఫోన్ల ట్యాపింగ్, నిఘాకు అనుమతి ఇవ్వకుండా ప్రైవేటు, ప్రభుత్వ ఫోన్ సంస్థలు, ట్రాయ్ను ఆదేశించాలని కోరారు.
అదే విధంగా కొంతమంది న్యాయమూర్తుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ జరగడంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు తక్షణం టెలికమ్యూనికేషన్ల నిపుణుడిని నియమించాలని సీవీసీకి, సీబీఐ డైరెక్టర్కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలనీ అభ్యర్థించారు. కాగా.. ఈ పిటిషన్పై ఈ నెల 18వ తేదీన విచారణ జరుగగా.. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్కు రాష్ట్రంలో ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని కూడా నియమించారని, ఆ మేరకు అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తానని పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. విచారణ సందర్భంగా అదనపు అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఆయన తెలుపగా.. దానిలోని అదనపు అభ్యర్థనలను ప్రధాన అఫిడవిట్ లోనే పొందుపరచి, సవరించిన అఫిడవిట్ ను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే 3వ తేదీకి వాయిదా వేసింది.
Also Read : మీడియా సంస్థల మధ్య ముదురుతున్న వార్!