BJP: బీజేపీపై నిశ్శబ్ద యుద్ధం మొదలైందా?

బీజేపీకి బలంగా భావించే సోషల్‌ మీడియానే ఇప్పుడు ఇండియా కూటమి వేదికగా చేసుకుంది. సైలెంట్‌గా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం మొదలు పెట్టింది. ఇటీవల ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలు అంటూ విస్తృతంగా ప్రచారం చేసింది.

Written By: Raj Shekar, Updated On : June 27, 2024 3:25 pm

BJP

Follow us on

BJP: దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. వరుసగా మూడోసారి బీజేపీ నేత్రృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే విపక్ష ఇండియా కూటమి అధికార ఎన్డీఏపై యుద్ధం మొదలు పెట్టింది. వాస్తవానికి ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఎంపీ సీట్లు తగ్గాయి, అదే సమయంలో కాంగ్రెస్‌ సీట్లు పెరిగాయి. ఇండియా కూటమి బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని బలహీన పర్చడమే లక్ష్యంగా ఇండియా కూటమి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.

సోషల్‌ మీడియా వేదికగా..
బీజేపీకి బలంగా భావించే సోషల్‌ మీడియానే ఇప్పుడు ఇండియా కూటమి వేదికగా చేసుకుంది. సైలెంట్‌గా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం మొదలు పెట్టింది. ఇటీవల ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలు అంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. వ్యక్తిగత ఖాతా ఉన్నవారు ఇతరులకు టికెట్‌ బుకింగ్‌ చేస్తే జైలుకు వెళ్తారని సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అయితే దీనిపై రైల్వే శాఖ వివరణ ఇచ్చుకుంది. ఇందులో వాస్తవం లేదని, తప్పుడు వార్తలు నమ్మొద్దని సూచించింది. కానీ, అప్పటికే ప్రజల్లో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తమైంది.

పన్నులపై ప్రచారం…
ఇక సోషల్‌ మీడియా వేదికగానే జీఎస్టీపైనా ప్రచారం మొదలు పెట్టారు. గతంలో కూడా అనేక రకాల పన్నులు ఉండేవి. కానీ, కేంద్రం ఈ పన్నులన్నీ కలిసి జీఎస్టీ పేరుతో ఒకే గాటికి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు చేస్తోంది. కానీ, దీనిపై విపక్ష ఇండియా కూటమి ఇప్పుడు కేంద్రం భారీగా పన్నులు విధిస్తోందని ప్రచారం మొదలు పెట్టింది. గతంలో వేర్వేరు పన్నులు కట్టినా అవి మనకు తెలిసేవి కావు. కానీ బీజేపీ జీఎస్టీ విధానంతో పౌరులు ఎంత పన్ను చెల్లిస్తున్నార్న విషయం తెలిసేలా చేసింది. దీనినే ఇపుపడు విపక్ష కూటమి తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. కేంద్రం జీఎస్టీ రూపంలో భారీగా పన్నులు వసూలు చేస్తోందని ప్రచారం చేస్తున్నాయి. తద్వారా కేంద్రంపై విషం చిమ్మే ప్రయత్నం జరుగుతోంది.

టోల్‌ వసూలుపై…
ఇక కేంద్రం వసూలు చేస్తున్న టోల్‌ ట్యాక్స్‌పైనా విపక్షాలు ప్రచార జోరు పెంచాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే జూన్‌ 1 అర్ధరాత్రి నుంచి టోల్‌ చార్జీలు 5 శాతం పెరిగాయి. దీంతో ఇప్పుడు దీనిని కూడా విపక్ష కూటమి తనకు అనుకూలంగా, కేంద్రంపై వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అటల్‌బిహారి వాజ్‌పేయి అమలు చేసిన స్వర్చ చతుర్భుజి పథకంంలో భాగంగా ప్రధాని మోదీ రోడ్ల విస్తరణకు అనేక చర్యలు చేపట్టారు. మోదీ ప్రధాని అయ్యాక వేల కిలోమీటర్ల రోడ్లు విస్తరణకు నోచుకున్నాయి. గతంలో ఉన్న గతుకుల రోడ్లు కనిపించడం లేదు. దూర భారం చాలా వరకు తగ్గింది. రెండు మూడు గంటల్లోనే వందల కిలోమీటర్లు ప్రయాణించ గలుగుతన్నారు. సౌకర్యాలు మెరుగుపర్చిన నేపథ్యంలో రహదారుల నిర్వహణకు అయ్యే చార్జీలను కూడా కేంద్రం వాహనదారుల నుంచే వసూలు చేస్తుంది. అందుకే రోడ్లు అందరికీ సౌకర్యంగా ఉంటన్నాయి. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా టోల్‌ చార్జీలను కూడా కేంద్రం సవరిస్తోంది. దీనిని కూడా విపక్షం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది.

ఇలా అనేక కార్యక్రమాలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీలు సోషల్‌ మీడియా వేదికగా మెల్లిగా జనంలోకి చొప్పిస్తున్నాయి. ఉన్నఫలంగా ప్రభుత్వానికి ఏమీ కాకపోయినా.. రాబోయే రోజుల్లో ఇవి బీజేపీకి నష్టం కలిగిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.