Haryana
Haryana : హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ ఓ పరీక్ష లాంటిది. దీనిలో కాంగ్రెస్ మళ్ళీ ఫెయిల్ అయింది. హర్యానాలోని మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్లను బిజెపి గెలుచుకుంది. కాగా, మనేసర్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి డాక్టర్ ఇంద్రజిత్ యాదవ్ విజయం సాధించారు. కాంగ్రెస్ 10 సీట్లలో ఒక్కదానిలోనూ ఖాతా తెరవలేకపోయింది. ఇది కాకుండా, 21 మునిసిపల్ కౌన్సిల్ల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. సోనిపట్, పానిపట్, గురుగ్రామ్ నుండి ఫరీదాబాద్ వరకు బిజెపి భారీ విజయాన్ని నమోదు చేసింది. జూలానా మునిసిపాలిటీ చైర్మన్ పదవిని కూడా బీజేపీనే కైవసం చేసుకుంది. వినేష్ ఫోగట్ జులానా అసెంబ్లీ నుండి గెలిచారు.
Also Read : మళ్లీ రైతుల పోరుబాట.. ఆ రెండు రాష్ట్రాల నుంచి రాజధాని బాట..
సోనిపట్లో బీజేపీ విజయయాత్ర
సోనిపట్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పదవికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక్కడ బీజేపీకి చెందిన రాజీవ్ జైన్ 34 వేల 749 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆయన పై పోటీ చేసిన కాంగ్రెస్కు చెందిన కమల్ దివాన్ 23 వేల 109 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. జాట్ ప్రాబల్యం ఉన్న సోనిపట్ పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బలం ఉంది. ఇప్పుడు మరోసారి గెలిచి ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని నిరూపించారని రాజీవ్ జైన్ అన్నారు.
గురుగ్రామ్లో కూడా బీజేపీ ఆధిపత్యం
అలాగే గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయదుంధుబి మోగించింది. ఆ పార్టీకి చెందిన రాజ్ రాణి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమా పహుజాను లక్ష 79 వేల 485 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 91 వేల 296 ఓట్లు వచ్చాయి. రాజ్ రాణి మల్హోత్రాకు మొత్తం 2,15,754 ఓట్లు పోల్ కాగా, తన ప్రత్యర్థి కాంగ్రెస్కు చెందిన సీమా పహుజాకు కేవలం 65,764 ఓట్లు మాత్రమే వచ్చాయి.
రోహ్తక్లో కూడా బీజేపీదే హవా
ఎన్నికల ముందు నుంచి రోహ్ తక్ చర్చల్లో నిలిచింది.ఈ జిల్లాను హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ బలమైన కోటగా భావిస్తారు. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ భారీ ఓటమిని చవిచూసింది. ఇక్కడి నుంచి బిజెపి అభ్యర్థి రామ్ అవతార్ కాంగ్రెస్కు చెందిన సూరజ్మల్ కిలోయిపై 45,198 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బిజెపికి 1,02,269 ఓట్లు, కాంగ్రెస్ కు 57,071 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో ఐఎన్ఎల్డీ మూడో స్థానంలో, ఆప్ నాల్గవ స్థానంలో నిలిచాయి.
ఫరీదాబాద్లో చితక్కొట్టిన బీజేపీ
ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ జోషికి 4,16,927 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి లతా రాణికి 100,075 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమె 3,16,852 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో ఆప్ అభ్యర్థి నిషా దలాల్ ఫౌజ్దార్ మూడో స్థానంలో నిలిచారు.
కర్నాల్లో కాంగ్రెస్ కు నిరాశ
మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సొంత నియోజకవర్గమైన కర్నాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ వాధ్వా 58 వేల 271 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీకి చెందిన రేణు బాల గుప్తా ఇక్కడ 83 వేల 630 ఓట్లు సాధించి గెలిచారు. ఆయన కాంగ్రెస్ను 25359 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ సీటు కూడా పంజాబీల ఆధిపత్యం కలిగింది. బీజేపీకి ఇక్కడ బలం ఉంది.
హిసార్లో భారీ తేడాతో ఓడిన కాంగ్రెస్
హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బీజేపీ తరఫున ప్రవీణ్ పోప్లి 64 వేల 456 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆయన కాంగ్రెస్కు చెందిన కృష్ణ టిటు సింగ్లాను ఓడించారు. ఒకవైపు పోప్లికి 96329 ఓట్లు వచ్చాయి. సింగ్లాకు 31872 ఓట్లు వచ్చాయి.
పానిపట్లో బిజెపి అభ్యర్థి ఘన విజయం
పానిపట్ లో బిజెపి అభ్యర్థి కోమల్ సైని ఇక్కడ గెలిచారు. 17 రౌండ్ల లెక్కింపు తర్వాత కూడా తను 1,08,729 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇది బిజెపికి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చచు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్జీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలో నిలిచింది.
మానేసర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం
గురుగ్రామ్ సమీపంలోని మానేసర్లో బిజెపి, కాంగ్రెస్ రెండూ ఓటమి పాలయ్యాయి. వీరు ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ ఇంద్రజిత్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఆయన 2,293 ఓట్ల తేడాతో గెలిచారు.ఇంద్రజిత్ యాదవ్ మొత్తం 26,393 ఓట్లు సాధించగా, బిజెపి మేయర్ అభ్యర్థి సుందర్ లాల్ కేవలం 24,100 ఓట్లు మాత్రమే పొందారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.
అంబాలాలో బిజెపి అభ్యర్థి విజయం
బీజేపీ సీనియర్ నాయకుడు అనిల్ విజ్ కు బలమైన కోటగా చెబుతారు. అంబాలాలో శైలజా సచ్ దేవా భారీ విజయం సాధించారు. అక్కడి ప్రజలు ఆయనను నగర మేయర్ గా ఎన్నుకున్నారు.
యమునానగర్లో బీజేపీ గెలుపు
పంజాబ్కు ఆనుకుని ఉన్న యమునా నగర్లో బిజెపి అభ్యర్థి సుమన్ బహమణి 51940 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ రకంగా చూస్తే బీజేపీ ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో దూసుకుపోతుందని చెప్పాలి. ఒకప్పుడు నేషనల్ లెవల్లో ఉండే బీజేపీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లిందని చెప్పాలి. అక్కడ స్థానికసంస్థల్లో కూడా తన సత్తా చాటుతోంది. ఇలా భవిష్యతులో చిన్న గ్రామాల్లోనూ లోకల్ పార్టీలను కాదని బీజేపీ చేరడం ఖాయమని తెలుస్తోంది.
Also Read : రీల్స్ పిచ్చికి పరాకాష్ట.. అందరూ చూస్తుండగానే ఆ పని.. లెంపలు వాయించిన వ్యాపారి.. వైరల్ వీడియో