అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు లేనప్పుడు మరో తీరుగా నాయకులు వ్యవహరించకూడదు. అధికారంలో ఉన్నప్పుడైనా, కోల్పోయినప్పుడైనా హుందాతనం కోల్పోకూడదు. ఎప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి వారి వెంటే నిలవాల్సిన అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాదాపు పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అప్పుడు ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. అప్పట్లో అధికార పక్షం మీద విమర్శలు చేసినా ఆయన అనుభవాన్ని ఉపయోగిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు.
2004లో అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలే చేశారు. ఆయన పథకాలలో అవినీతిని ఎండగట్టారు. అప్పుడు వైఎస్ కూడా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో వైఎస్ ప్రజల్లోకి వెళ్లారు. అయినా చంద్రబాబు ఫ్రస్టేషన్ కు గురికాలేదు. రెండోసారి వైఎస్ అధికారంలోకి వచ్చినా ఓటమిని హుందాగానే స్వీకరించారు.
ప్రస్తుతం చంద్రబాబు ఓటమిని ఒప్పుకోవడం లేదు. జగన్ చేతిలో ఓటమిని చంద్రబాబు జీర్ణించకోలేకపోతున్నారు. ప్రజలనే తప్పు పడుతున్నారు. దీనికి ఓటమి ఒక్కటే కారణం కాదు. చంద్రబాబుకు పరాజయం కొత్తేమీ కాదు. వైఎస్ హయాంలోను, ఆయన మరణం తరువాత కాంగ్రెస్ పాలనలో గానీ చంద్రబాబుకు ఇబ్బందులు రాలేదు. ఇక తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకం బాబులో ఉండేది. ఆర్థిక ఇబ్బందులు కూడా పడలేదు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. తనతో పాటు టీడీపీ అగ్రనేతల ఆర్థిక మూలాలను ఇప్పటికే జగన్ దెబ్బతీస్తున్నారు. ఇది చంద్రబాబు ఫ్రస్ర్టేషన్ కు కారణమంటున్నారు. అక్రమ కేసులకు పెద్దగా భయపడకపోయినా అమరావతి రాజధానిని ఆపేయడం, అక్కడ భూముల రేట్లు పడిపోవడం, అమూల్ సంస్థను తెచ్చి హెరిటేజ్ ను దెబ్బతీయడం వంటి చర్యలతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే చంద్రబాబు తరచూ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారంటున్నారు.