Homeజాతీయ వార్తలుGold Import Duty In India: బంగారం.. ఖరీదైన లోహమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థ...

Gold Import Duty In India: బంగారం.. ఖరీదైన లోహమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థ నే సవాల్ చేస్తోంది..

Gold Import Duty In India: బంగారం.. ఖరీదైన లోహాలలో ఒకటి.. వజ్రం, ప్లాటినం కంటే తక్కువ ఖరీదైనప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చాలామంది బంగారాన్ని వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఆభరణాల తయారీలో బంగారానికే మొదటి ఓటు వేస్తుంటారు.. పైగా బంగారాన్ని మహిళలు విపరీతమైన సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. అందువల్లే భారత్ లాంటి దేశంలో బంగారం పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతూ ఉంటుంది.

బంగారం ఎలా అయితే మెరుస్తుందో.. దీని ఆధారంగా సాగే రంగాలు అదే స్థాయిలో దూసుకుపోతుంటాయి. అయితే బంగారం వినియోగం స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో భారత్ లాంటి దేశం దిగుమతుల మీద ఆధారపడుతూ ఉంటుంది. ఈ దిగుమతులే ఇప్పుడు భారత్ కు గుదిబండ లాగా మారిపోయాయి.. అందువల్లే భారత ఆర్థిక వ్యవస్థ బంగారం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. అయినప్పటికీ బంగారం దిగుమతులు మనదేశంలో తగ్గడం లేదు. బంగారం దిగుమతికి అధికంగా ఫారెక్స్ నిల్వలను ఖర్చు చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో భారత్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సుంకం పెంచడం వల్ల మనదేశంలో ఉన్న బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. పాత బంగారం రీసైక్లింగ్ కు వచ్చేస్తూ ఉంటుంది. దీనివల్ల దిగుమతులు చాలా వరకు తగ్గుతాయి. అదే సమయంలో పన్నులు అధికంగా ఉన్నప్పుడు.. అక్రమ మార్గంలో బంగారం దేశానికి దిగుమత అయ్యే ప్రమాదం లేకపోలేదు.. దీనిని ఏ విధంగా అడ్డుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మన దేశంలో ఉన్న ప్రధాన విమానాశ్రయాలలో ప్రతిరోజు కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న బంగారాన్ని పట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు బంగారం మీద సుంకం పెంచిన నేపథ్యంలో.. అధికారులు దాడులను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.

ఇక మనదేశంలో బంగారం మీద సుంకం విధించడం ఇదే తొలిసారి కాదు. 2022లో బంగారం మీద సుంకం 10.75 శాతం ఉండేది. అప్పుడు దానిని 15% కి పెంచారు. 2024 లో మనదేశంలో ఆభరణాల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సుంకం మొత్తాన్ని ఆరు శాతానికి తగ్గించారు.. మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం వల్ల సుంకం మొత్తాన్ని ఆరు శాతం నుంచి 15% పెంచారు. 2012 కంటే ముందు కూడా బంగారం పై దిగుమతి సుంకం ఉండేది. అయితే బంగారం విలువతో సంబంధం ఉండేది కాదు. 10 గ్రాములకు కేవలం 300 రూపాయలు చొప్పున సుంకం వసూలు చేసేవారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాట్ అనే విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అప్పుడు బంగారం విలువలో రెండు శాతం కస్టమ్స్ టాక్స్ విధించేవారు. దీంతో నాడు బంగారం మీద ఒక శాతంగా ఉన్న దిగుమతి సుంకం డబుల్ అయింది. బడ్జెట్లో అయితే దానిని నాలుగు శాతం పెంచేశారు.

2013లో రూపాయి విలువ దారుణంగా పతనమైంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ సంవత్సరం ప్రభుత్వం ఏకంగా మూడుసార్లు సుంకాన్ని పెంచేసింది. 2013లో జనవరిలో నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి పెంచింది. జూన్ నెలలో ఏకంగా 6 నుంచి 8 శాతానికి పెంచింది. ఆగస్టులలో 8 నుంచి 10 శాతానికి పెంచింది. 2014 అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 వరకు దాదాపు 10 శాతం దిగుమతి సుంకం మాత్రమే వసూలు చేసేవారు. 2019లో 12.5% పెంచేశారు. 2021 కేంద్ర బడ్జెట్లో 12.5% నుంచి 10.75% తగ్గించారు. తాజాగా 15% సుంకం పెంచిన నేపథ్యంలో.. దాని విలువలను కేంద్రం బయటపెట్టింది. 10 శాతాన్ని ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీగా.. ఐదు శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ గా ప్రకటించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version