చివరి రోజు కూడా సంస్కరణలపై దృష్టి

నిర్మలా సీతారామన్ ఈరోజు చివరి విడతగా మరికొన్ని ప్రకటనలు చేసారు. దీనిలో సంస్కరణలు, వుద్దీపనలు, ఉపశమనాలు వున్నాయి. దీనితో మొత్తం 21 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజి ని ప్రకటించినట్లయ్యింది. ఇందులో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఇంతకుముందే ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1 లక్ష 93 వేల కోట్లు, రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన 8 లక్షల 1 వేయి కోట్లు వున్నాయి. అంటే ఇప్పుడు ప్రకటించినవి షుమారు 11 లక్షల […]

Written By: Ram, Updated On : May 17, 2020 7:44 pm
Follow us on

నిర్మలా సీతారామన్ ఈరోజు చివరి విడతగా మరికొన్ని ప్రకటనలు చేసారు. దీనిలో సంస్కరణలు, వుద్దీపనలు, ఉపశమనాలు వున్నాయి. దీనితో మొత్తం 21 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజి ని ప్రకటించినట్లయ్యింది. ఇందులో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఇంతకుముందే ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1 లక్ష 93 వేల కోట్లు, రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన 8 లక్షల 1 వేయి కోట్లు వున్నాయి. అంటే ఇప్పుడు ప్రకటించినవి షుమారు 11 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ఇందులో ఈరోజు ప్రకటించిన 40 వేల కోట్ల రూపాయల అదనపు  గ్రామీణ ఉపాధి పధకం  నిధులు కూడా వున్నాయి. ఇప్పుడు ఈరోజు ప్రకటించిన పధకాల వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం.

  1. గ్రామీణ ఉపాధి పధకం కింద అదనంగా 40 వేల కోట్ల రూపాయలు కేటాయింపు. ఇది బడ్జెట్ లో కేట్టయించిన 60 వేల కోట్లకు అదనం. అంటే మొత్తం లక్ష కోట్ల రూపాయలు ఉపాధి పధకానికి కేటాయించారు. దీనివలన మొత్తం 300 కోట్ల పనిదినాలు కల్పించినట్లయింది.
  2. ఆరోగ్య  రంగం లో ప్రభుత్వ పెట్టుబడుల పెంపు ( అయితే దీనికింద ఎటువంటి అదనపు నిధులు కేటాయించలేదు) . ఇందులో భాగంగా ప్రతి జిల్లా లో అంటువ్యాధుల ఆసుపత్రి విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ల్యాబ్ లను ప్రతి జిల్లా, బ్లాక్ స్థాయి లో ఏర్పాటు చేస్తారు.
  3. పి ఎం ఇ – విద్య  పధకాన్ని అమలు చేస్తారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యకోసం ‘దీక్ష’ , టీవీ , రేడియో పాడ్ కాస్ట్ ల ద్వారా విద్య  లాంటి కార్యక్రమాలు పొందుపరచారు. అలాగే 100 విశ్వవిద్యాలయాల్లో ఆన్ లైన్ కోర్సులు ఈ నెల చివరికల్లా ప్రారంబిస్తారు.ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ( దీనికింద ఎటువంటి అదనపు కేటాయింపులు జరపలేదు).
  4. సులభ తర వ్యాపారం లో భాగంగా దివాలా కోరు చట్టం లో మార్పులు తీసుకొస్తారు. ఎం ఎస్ ఎం ఇ ల కింద రక్షణ లక్ష రూపాయల నుంచి ఒక కోటి రూపాయలకు పెంచారు. ఎం ఎస్ ఎం ఇ లను ప్రత్యేక చట్రం కిందకు తెస్తారు. కరోనా మహమ్మారి నేపధ్యం లో పరిస్థితులను బట్టి ఒక సంవత్సరం వరకూ దివాలా కోరు ప్రక్రియ ను ఆపివేయవచ్చు.
  5. కంపెనీ చట్టం సరళీకృతం : నిబంధనలు ఉల్లంఘనల పేరుతో వున్న నేర పూరిత అధికరణల్లో మార్పులు. 7 నేర ఆరోపణలని తొలగించటం, 5  ఆరోపల్ని ప్రత్యామ్నాయ చట్రం కిందకు తీసుకురావటం జరిగింది.
  6. ప్రభుత్వరంగ సంస్థల పై కొత్త విధానం: దీనిప్రకారం అన్ని ప్రభుత్వరంగ సంస్థలూ ప్రైవేటీకరణ కిందకు తీసుకొస్తారు, కేవలం కొన్ని వ్యూహాత్మక రంగాల్లో తప్ప ( అయితే తక్షణం జరగదు, అవకాశాన్నిబట్టి దశలవారిగా చేస్తారు). వ్యూహాత్మక రంగాల్లో కనీసం ఒకటి ప్రభుత్వ రంగం లో వుంటుంది. మిగతావి ప్రైవేటు రంగం లో వుంటాయి. అలాగే వ్యూహాత్మక రంగం లో ఉన్నవాటిని క్రమబద్దీకరిస్తారు.
  7. రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు: ఇప్పటికే కోవిడ్-19  తర్వాత అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర పన్నుల వాటా కింద 46 వేల 38 కోట్ల రూపాయలు ముందస్తుగా ఇచ్చారు. రెవిన్యూ లోటు కింద 12 వేల 390 కోట్ల రూపాయలు, విపత్తు నిధి కింద 11 వేల 92 కోట్లు, ఆరోగ్య శాఖ కింద 4 వేల 113 కోట్లు ఇవ్వటం జరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంకు రుణ పరిమితి ని 60 శాతానికి పెంచింది. ఓవర్ డ్రాఫ్ట్ నిబంధనల్ని సడలించింది.                                                                                                                                                                                     అయినా రాష్ట్రాల కోరిక మేరకు రుణ పరిమితి శాతాన్ని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. అయితే ఇందుకు సంస్కరణలను లింక్ గా పెట్టింది. 3.5 శాతం వరకు ఎటువంటి షరతులు లేవు. ఆ పైన సంస్కరణలు అమలు చేస్తేనే రుణ పరిమితి సడలింపు వుంటుంది. ఇది మంచి నిబంధన. దీనితో రాష్ట్రాలు కూడా సంస్కరణల బాట పట్టాల్సిందే. దీనివలన అదనంగా 4.28 లక్షల కోట్లు రాష్ట్రాలకు అందుబాటు లోకి వస్తాయి.                                                                                                                                                      మొత్తం మీద ఈ అయిదు రోజులు కలిపి ఎప్పుడూ లేనివిధంగా అనేక వుద్దీపనలు , ద్రవ్యలభ్యతా చర్యలు, కీలక సంస్కరణలు చేపట్టింది. ఒకవిధంగా చెప్పాలంటే 1991 తర్వాత అతి పెద్ద ఆర్ధిక విధానంగా దీన్ని చెప్పొచ్చు. ఉద్దీపనా చర్యలు ప్రకటిస్తూనే కీలక ఆర్ధిక సంస్కరణలకు ఊతం ఇచ్చింది. ఈ చర్యలు ఏ మేరకు ప్రపంచ పెట్టుబడులను ఆహ్వానిస్తాయో , భారత ఆర్ధిక పరిస్థితులు ఏ మేరకు బాగుపడతాయో, పేద, మధ్య తరగతి ప్రజల బతుకుల్లో ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో వేచి చూద్దాం.