ఇలా చేస్తేనే రైతుబంధు.. లేకుంటే లేదు!

తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకానికి కీలకమైన షరతు పెట్టింది. ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. తమకు తోచిన పంటను పండించిన వారి ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయరాదని ఆయన అన్నారు. తెలంగాణలో వ్యవసాయం లాభసాటి కావాలన్నా, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంపూర్ణ ఫలితం ఇవ్వాలన్నా పంటలకు మంచి ధర రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇందుకోసం పంటల సాగు ఎవరికిష్టం వచ్చినట్లు వారు చేసుకోకుండా.. […]

Written By: Neelambaram, Updated On : May 11, 2020 12:33 pm
Follow us on

తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకానికి కీలకమైన షరతు పెట్టింది. ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. తమకు తోచిన పంటను పండించిన వారి ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయరాదని ఆయన అన్నారు. తెలంగాణలో వ్యవసాయం లాభసాటి కావాలన్నా, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంపూర్ణ ఫలితం ఇవ్వాలన్నా పంటలకు మంచి ధర రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇందుకోసం పంటల సాగు ఎవరికిష్టం వచ్చినట్లు వారు చేసుకోకుండా.. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పినట్లు పంటలు వేసే విధానం రావాలని కెసిఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సాగైన పంటలకు మంచి ధర వచ్చి, రైతులకు మేలు జరగాలని, ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రగతిభవన్ లో వ్యవసాయంపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. తెలంగాణలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై  అన్ని మండలాల వ్యవసాయ విస్తరణాధికారులు, రైతుబంధుసమితి ప్రతినిధులతో దూరదృశ్యసమీక్ష ద్వారా స్వయంగా మాట్లాడతానని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నిపుణులు మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలని, ఆ పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దని సూచించారు. రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి వచ్చి తీరాలని అభిప్రాయపడ్డారు. ఇంకా పలు సూచనలు చేశారు.

‘దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ రూపొందుతోంది. రాష్ట్రంలో రాబోయే కాలంలో దాదాపు 90 లక్షల ఎకరాల్లో ప్రతి ఏటా వరి పండుతుంది. రెండు కోట్ల 70 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి అనుగుణంగా రైస్‌ మిల్లులు తమ సామర్థ్యం పెంచుకోవాలి. మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేయడమే కాకుండా, ఆ ముడి సరకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా తీసుకునే క్రియాశీలసంస్థగా పౌరసరఫరాల సంస్థ రూపాంతరం చెందాలి. దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుంది. వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుతాయి. కల్తీలను అరికట్టవచ్చు. వ్యవసాయాధికారులు, రైతు బంధు  సమితి, వ్యవసాయ యూనివర్సిటీ, పౌరసరఫరాల సంస్థ సమన్వయంతో పనిచేయాలి. రైతులకు మేలు చేసే వ్యవసాయ విధానాన్ని అమలు చేసి చైతన్యం కలిగించాలి’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.