
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని’ వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. రాజన్న సంక్షేమ పాలనను తీసుకురావడమే ధ్యేయమంటూ తెలంగాణ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ముందుకు వచ్చారు.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ రాయదుర్గం జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ఆర్ చెరగని చిరునవ్వు కోట్లాది ప్రజల్లో నిలిచిన సంక్షేమ సంతకమన్నారు. వైఎస్ఆర్ రాజకీయాలకతీతంగా సాయం చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పుట్టినరోజునే పార్టీ ఆనందదాయకమన్నారు. సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినట్లు చెప్పారు.
సమానత్వం, స్వయం సంవృద్ధి , సంక్షేమం పార్టీ సిద్ధాంతమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. సంక్షేమ పాలనలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు.గారడీ మాటల గొప్పలు..చేతికి చిప్పలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజలు ఇప్పటికీ వైఎస్ఆర్ పాలనను తలుచుకుంటున్నారన్నారు.
పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యమని షర్మిల స్పష్టం చేశారు. ‘కరోనా వల్ల ఎంతో మంది నష్టపోయారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే ఎంతో మందికి భరోసా ఉండేది. సంక్షేమంలో నంబర్ వన్ అని చెప్పుకునే కేసీఆర్.. కరోనా వల్ల అప్పుల పాలైన వారికి ఏం చెబుతారు? నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని.. కంట్లో కారం కొట్టి నోట్లో బెల్లం పెట్టినట్లు చేస్తున్నారని.. కుటుంబాలతో పాటు ఏకంగా రాష్ట్రాన్ని కూడా అప్పులమయం చేశారని విమర్శించారు. రూ. 4లక్షల కోట్లు అప్పు చేశారని.. ఇవి ఎవరి జేబులోకి పోయాయని షర్మిల ప్రశ్నించారు.
వైఎస్ షర్మిల తాజాగా పార్టీ జెండా ఆవిష్కరించారు. నీలం రంగు బడుగు, బలహీన వర్గాలను ప్రతిబింబించేలా చేర్చారని తెలిపారు.అంబేద్కర్ చెప్పిన మాటలతో నీలం రంగు ఆవిష్కృతమైంది. ఆ తర్వాత పాలపిట్ట రంగుపై తెలుపు రంగు తెలంగాణ చిత్రపటంలో వైఎస్ఆర్ చిత్రం ప్రత్యక్షమైంది. అనంతరం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను తల్లి విజయమ్మ కలిసి షర్మిల ఆవిష్కరించారు.