Chandrababu Naidu: చంద్రబాబు యాగాలను నమ్ముతారా?

యాగాలు సత్ఫలితాలనిస్తుండడంతో టీడీపీ నేతల్లో కూడా ఆలోచన ప్రారంభమైంది. చంద్రబాబుతో ఒక యాగాన్ని జరిపిస్తే ఆయన అధికారంలోకి రాగలుగుతారని నమ్ముతున్నారు.

Written By: Dharma, Updated On : June 10, 2023 6:06 pm
Follow us on

Chandrababu Naidu: తెలుగునాట రాజకీయ నాయకుల్లో భక్తిభావం పెరుగుతోంది. ముఖ్యంగా తాము అధికారంలోకి రావాలంటే ప్రజాబలంతో పాటు ధైవబలం కూడా తోడుకావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. అందుకే యాగాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజశ్యామల యాగంతో రాజ్యాధికారం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ తరహా యాగాలు చేసి అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చామని బలంగా నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని పదిలం చేసుకోవాలని జగన్ ఇటీవలే ప్రభుత్వం తరుపున రాజశ్యామల యాగాన్ని జరిపించారు. ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్రకు సిద్ధపడుతున్న తరుణంలో… అంతకు ఒకరోజు ముందు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన నేతలు యాగాన్ని నిర్వహిస్తున్నారు.

యాగాలు సత్ఫలితాలనిస్తుండడంతో టీడీపీ నేతల్లో కూడా ఆలోచన ప్రారంభమైంది. చంద్రబాబుతో ఒక యాగాన్ని జరిపిస్తే ఆయన అధికారంలోకి రాగలుగుతారని నమ్ముతున్నారు. చంద్రబాబుకు దైవభక్తి ఎక్కువే. అయినా.. ఆయన ఎక్కడా పూజలు, యాగాలు చేసింది తక్కువే. ఆయన రాజకీయంగా ఎపుడూ జనంతోనే ఉంటూ వచ్చారు. ఆయన వ్యూహాలనే నమ్ముకుంటున్నారు. ఎత్తులు, ప్లాన్స్ అన్నవి బాబు రాజకీయంలో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం జనసేన, బీజేపీతో పొత్తులు కుదర్చుకునే పనిలో పడ్డారు. అధికారంలోకి వస్తానని నమ్మకంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో దైవ బలం తోడైతే ఏకపక్ష విజయం దక్కుతుందని భావిస్తున్నారు.

అయితే ఈ విషయంలో చంద్రబాబు ఏమనుకుంటున్నారో తెలియదు.. కానీ కొందరు టీడీపీ ప్రముఖులు మాత్రం ఆధ్యాత్మిక వేత్తలను సంప్రదించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజశ్యామల అమ్మ వారిని ఆరాధించడం ద్వారా తిరిగి రాజ్యాన్ని పొందవచ్చు అని చెబుతున్న ఆధ్యాత్మిక వేత్తలూ ఉన్నారు. మరి చంద్రబాబు వైఖరి చూస్తే ఆయన ఇలాంటి యాగాలు చేయడానికి ముందుకు వస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే చంద్రబాబు నేరుగా కాకపోయినా ఆయన పేరుత ఆయన తరుపున ఎవరైనా రాజ శ్యామల యాగాన్ని నిర్వహిస్తే బాగా ఉంటుందని.. టీడీపీకి అన్ని విధాలుగా మేలు జరుగుతుందని ఎక్కువ మంది ఆధ్యాత్మికవేత్తలు భావిస్తున్నారు.

వైసీపీ ఎక్కువగా విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామిని ఆశ్రయిస్తుంటుంది. టీడీపీ నమ్ముకున్న స్వామిజీలు తక్కువే. అయితే ఎవరైనా ఆధ్యాత్మిక వేత్తలతో టీడీపీ రాజశ్యామల యాగం జరిపిస్తే మంచిదని సూచిస్తున్నారు. అయితే దీనికి చంద్రబాబు ఒప్పుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మొన్నటివరకూ వైసీపీ యాగాలు, స్వామిజీల ఆరాధానలపై టీడీపీ విమర్శలు చేసింది. ఇప్పుడు అదే పని టీడీపీ చేస్తే విమర్శలు చుట్టుముట్టే చాన్స్ ఉంది.