Operation RTG: ఆపరేషన్ ఆర్టీజీ.. సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ ఎందుకో తెలుసా.. గుండెలను ద్రవింపజేసే కథనం ఇది..

దీనికి సంబంధించి విశ్రాంత ఆర్మీ అధికారి బ్రిగేడియర్ హర్దీప్ సింగ్ సోహి తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హై ఆల్టిట్యూడ్ వార్ ఫేర్ స్కూల్ (HAWS) లో మన దేశ సైనికులు చూపించిన ధైర్యాన్ని ఆయన కొనియాడారు.."అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించారు. అమరవీరుల మృతదేహాలను బయటకు తీశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 12, 2024 10:36 am

Do you know why RTG operation was undertaken by the army

Follow us on

Operation RTG: అది జమ్మూ కాశ్మీర్ లోని లద్దాఖ్ ప్రాంతం. ఏడాది మొత్తం అక్కడ మంచు కురుస్తూనే ఉంటుంది. అత్యంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆ ప్రాంతంలో మన సైనికులకు అత్యంత ఎత్తైన ప్రదేశాలలో యుద్ధ వ్యూహాలు ఎలా అమలు చేయాలో నేర్పిస్తారు. అయితే ఈ లద్దాఖ్ శ్రేణిలో కున్ అనే పర్వతం ఉంది. దానిని అధిరోహించేందుకు మన దేశ ఆర్మీకి చెందిన సైనికులు మొత్తం 38 మంది వెళ్లారు. వారు అక్కడికి వెళ్లిన తర్వాత హఠాత్తుగా స్నో ఫాల్ (హిమపాతం) ముంచెత్తింది. దాన్నుంచి 34 మంది సైనికులు బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డారు. కానీ నలుగురు సైనికులు మాత్రం ఆ హిమపాతంలో చిక్కుకుని కన్నుమూశారు. ఆ హిమపాతం వల్ల చనిపోయిన నలుగురు సైనికుల పార్థివదేహాల కోసం దాదాపు 6 గంటల పాటు మిగతా సైనికులు శ్రమించారు. అందులో ఒక జవాన్ పార్థివ దేహాన్ని బయటికి తీశారు. మిగతా వారి పార్థివదేహాలు లభించలేదు. 9 నెలల తర్వాత మిగతా ముగ్గురి మృతదేహాలను ఆ సైనికులు వెలికి తీశారు. ఈ సంఘటన గత ఏడాది అక్టోబర్ 8న చోటుచేసుకుంది.

దీనికి సంబంధించి విశ్రాంత ఆర్మీ అధికారి బ్రిగేడియర్ హర్దీప్ సింగ్ సోహి తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హై ఆల్టిట్యూడ్ వార్ ఫేర్ స్కూల్ (HAWS) లో మన దేశ సైనికులు చూపించిన ధైర్యాన్ని ఆయన కొనియాడారు..”అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించారు. అమరవీరుల మృతదేహాలను బయటకు తీశారు. మీ చొరవ గొప్పది. మీ స్ఫూర్తి అజరామరమైనది. మీ తెగువ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని” ఆయన ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.

గత ఏడాది అక్టోబర్ 8న ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హవల్దార్ రోహిత్ కుమార్, ఠాకూర్ బహుదూర్, నాయక్ గౌతమ్, స్టాన్జిన్ మంచు పలకల కింద చిక్కుకొని తుది శ్వాస విడిచారు. ఘటన జరిగిన రోజు మిగతా సైనికులు దాదాపు 6 గంటల పాటు తీవ్రంగా శ్రమించి స్టాన్జిన్ మృతదేహాన్ని బయటకి వెలికి తీశారు. అయితే ఆరోజు విపరీతమైన మంచు కురవడంతో మిగతా వారి మృతదేహాలు గుర్తించడం, బయటికి తీయడం సాధ్యం కాలేదు. దీంతో “సైనికుల మృతదేహాలను బయటకు తీయడం ఇంత ఆలస్యం”అంటూ సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నించారు.

అయితే అలాంటి వారి సందేహాలను హర్దీప్ సింగ్ నివృత్తి చేశారు.”సోషల్ మీడియాలో కొందరు వీర సైనికుల మృతదేహాలను బయటకు తీయడం ఇంత ఆలస్యమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఘటన జరిగిన ఆరు గంటల్లోనే ఒక వీర సైనికుడి మృతదేహాన్ని బయటకి తీసిన సైనికులు.. మిగతా వారి విషయంలో నిర్లక్ష్యం ఎందుకు చూపుతారు? ఇలాంటి అప్పుడే మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. వాస్తవానికి ఆ శిఖరంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 70 అడుగుల లోతుకు మృతదేహాలు కూరుకుపోయాయి. ఆ ప్రదేశాన్ని గుర్తించడం అంత సులభం కాదు. ప్రతికూల వాతావరణంలో మృతదేహాలను వీరికి తీయడం ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఏ ఒక్క సైనికుడి మృతదేహాన్ని వెలికితీయకుండా ఉండకూడదనే ఉద్దేశంతో.. మన దేశ ఆర్మీ రెక్కో రాడార్లను తీసుకెళ్లింది. తొమ్మిది రోజులపాటు కష్టపడి.. ఆ సైనికుల మృతదేహాలను వెలికి తీసిందని” హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు.

వాస్తవానికి ఆ సైనికులు గత ఏడాది అక్టోబర్ 1న పర్వతారోహణను ప్రారంభించి.. అక్టోబర్ 13 నాటికి కున్ శిఖరానికి చేరువవ్వాల్సి ఉంది. అక్టోబర్ 8 నాటికి ఆ సైనికులు దాదాపు 18,300 అడుగుల ఎత్తుకు వచ్చేశారు. అప్పుడే విపరీతమైన హిమపాతం కురిసింది. దీంతో ఆ సైనికులు వాటి కిందపడి చనిపోయారు. అయితే వారి మృత దేహాలను ఏమాత్రం వదలకూడదనే ఉద్దేశంతో ఆర్మీ గట్టిగా రంగంలోకి దిగింది. అధునాతన రాడార్ల సహాయంతో వారి ఆచూకీని కనుగొన్నది. తీవ్రంగా శ్రమించి వారి మృతదేహాలను వెలికి తీసింది. హెచ్ డబ్ల్యూఎస్ డిప్యూటీ కమాండెంట్ బ్రిగేడియర్ శకావత్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక సైనికుల బృందం జూన్ 18న ఆ పర్వతం వద్దకు చేరుకుంది. ఈ ఆపరేషన్ కు రోహిత్, ఠాకూర్, గౌతమ్ (ఆర్టీజీ) అని పేరు పెట్టింది. 9 రోజులపాటు నిద్రాహారాలు మానేసి.. ప్రతికూల వాతావరణాన్ని కూడా తట్టుకొని.. ఆ సైనికుల బృందం అమర జవాన్ల ఆచూకీ కనుగొన్నది. వారి మృతదేహాలను వెలికి తీసి కుటుంబ సభ్యులకు అప్పగించింది. కుటుంబ సభ్యులకు వీర సైనికుల మృతదేహాలను అప్పగిస్తున్న సమయంలో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది.