Did Chandrababu lose hope in that area ...?
నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో టీడీపీకి బాగా పట్టున్న ఏరియాల్లో ఉత్తరాంధ్ర ఒకటి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు నుండి 2014 ఎన్నికల వరకు తెలుగుదేశానికి ఉత్తరాంధ్ర కంచుకోటగా నిలిచింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ కంచుకోట కాస్తా వైసీపీ కంచుకోటగా మారింది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు టీడీపీ అనుకూల జిల్లాలుగా పేరు తెచ్చుకోగా 2019 ఎన్నికల ఫలితాల తరువాత ఈ జిల్లాలపై వైసీపీ అనుకూల జిల్లాలుగా ముద్ర పడింది.
కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతూ ఉంటాయి. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ప్రభ తగ్గుతోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న 34 సీట్లలో 28 సీట్లు వైసీపీ సొంతమయ్యాయి. విజయనగరం జిల్లాలో టీడీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. అయితే ఎన్నికల ఫలితాల తరువాతైనా తప్పులను సరిదిద్దుకుని టీడీపీ అక్కడ బలపడుతోందా…? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది.
బీసీ వర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉండగా ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్యనేతగా చెప్పుకునే అచ్చెన్నాయుడు ఈ.ఎస్.ఐ కుంభకోణంలో ఇరుక్కున్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష విశాఖలో ఉండి పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. విశాఖలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు చూస్తున్నారు. జగన్ ఉత్తరాంధ్రలోని టీడీపీ నాయకులను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఆ పార్టీ అడ్రస్ కూడ గల్లంతైనా ఆశ్చర్యాపోవాల్సిన అవసరం లేదు.
చంద్రబాబు అమరావతే రాజధానిగా ఉండాలని చేస్తున్న వ్యాఖ్యలు కూడా టీడీపీ పాలిట శాపంగా మారాయి. బాబు అనుకూల మీడియా విశాఖ విషయంలో రాస్తున్న విషపు రాతలు టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఆ ప్రాంతంపై ఆశలొదిలేసుకున్నారని టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తూ ఉండటం గమనార్హం.