Delhi Rain: ఇంతకు ముందు చలి.. ఎండలతోనే కష్టం అంటే ఇప్పుడు వర్షాలు.. ఈ ఢిల్లీలో ఎలా ఉంటారో?

ఢిల్లీని ఏటా శీతాకాలంలో వాయు కాలుష్యం అతలాకుతలం చేస్తోంది. ఒకవైపు పెరిగిన వాహనాలతో వాయు కాలుష్యం పెరుగుతోంది. మరోవైపు పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతులు పంటల వ్యర్థాలను కాల్పడం వలన అక్కడి పొగ అంతా ఢిల్లీని కమ్మేస్తోంది.

Written By: Raj Shekar, Updated On : June 29, 2024 2:18 pm

Delhi Rain

Follow us on

Delhi Rain: ఢిల్లీ.. భారత రాజధాని.. కేంద్రపాలిత ప్రాంతమే అయినా.. దేశంలోని మెట్రోపాలిటన్‌ సిటీలలో ఒకటి. దేశ పాలనా యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది. ఐదేళ్ల క్రితం వరకు ఇక్కడి జీవనం సాపీగా సాగింది. తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయి. రాజధానిపై ప్రకృతి కన్నెర్ర జేస్తోంది. ఒకవైపు వాయు కాలుష్యం.. ఇంకోవైపు విపరీతమైన చలి.. మరోవైపు విపరీతమైన వేడి.. ఇక రెండేళ్లుగా ముంచెత్తుతున్న వరదలు.. ప్రకృతి ప్రకోపానికి దేశ రాజధానిలో ధనిక, పేద అనే తేడా లేకుండా జనం విలవిలలాడుతున్నారు. సీజన్‌ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల కారణంగా బతకడం భారంగా మారుతోంది.

ఒకవైపు వాయు కాలుష్యం..
ఢిల్లీని ఏటా శీతాకాలంలో వాయు కాలుష్యం అతలాకుతలం చేస్తోంది. ఒకవైపు పెరిగిన వాహనాలతో వాయు కాలుష్యం పెరుగుతోంది. మరోవైపు పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతులు పంటల వ్యర్థాలను కాల్పడం వలన అక్కడి పొగ అంతా ఢిల్లీని కమ్మేస్తోంది. దీంతో చలికాలంలో ఊపిరి తీసుకోవడం కూడా ఢిల్లీ వాసులకు కష్టంగా మారుతోంది. గాలిలో మోనో కార్బన్లు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు.

విపరీతమైన చలి..
ఇక ఢిల్లీని రెండేళ్లుగా చలి కూడా వణికిస్తోంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హిమాలయాల నుంచి వీస్తున్న చల్ల గాలులకు ఢిల్లీ వాజులు గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు మైనస్‌లలో నమోదవుతున్నాయి. గడ్డకట్టే చలిలో బతుకు జీవుడా అంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి.

రికార్డుస్థాయిలో ఎండలు..
ఇక వేసవి కాలంలో దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి వీచే చల్ల గాలులతో నాలుగైదేళ్ల క్రితం వరకు ఢిల్లీలో వేసవిలో కూడా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కాని పెరుగుతున్న కాలుష్యం, పెరిగిన వాహనాల పొగతో వాతావరణం వేడెక్కుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది రికార్డుస్థాయిలో ఎండలు దంచికొట్టాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈఏడాది తాగునీటికి కూడా కరువు ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో హరియాణా విడుదల చేస్తే కానీ దాహం తీర్చుకోలేని పరిస్థితి. దీంతో ఎండ వేడిని తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. మధ్యాహ్నం బయటకు రాలేని పరిస్థితి.

ముంచెత్తుతున్న వరదలు..
ఇక రెండేల్లుగా ఢిల్లీని వరదలు కూడా ముంచెత్తుతున్నాయి. పెరిగిన రద్దీ, వాయు కాలుష్యం కారణంగా దేశ రాజధానిలో కుంభవృష్టి కురస్తోంది. గంట వ్యవధిలోని 10, 20 సెంటీ మీటర్ల వర్షం కురుస్తోంది. దీంతో భారీగా వరదలు వచ్చి జనజీవనం అతలాకుతలం అవుతోంది. వరదలు ఇళ్లను ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. వాహనాలు కదలలేని పరిస్థితి. వరదలతో ఢిల్లీ వాసులు నరకం చూస్తున్నారు. గతేడాది అయితే యమునా నదికి రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. దీంతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్‌ వరకు వరద నీరు వచ్చింది. తాజాగా మళ్లీ ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. వర్షాకాలం ఇంకా మూడు నెలలు ఉంది. ఇదేస్థాయిలో వర్షాలు కురిస్తే ఢిల్లీలో ఈసారి తీవ్ర నష్టం జరగడం ఖాయమంటున్నారు.

కానరాని ప్రత్యామ్నాయ చర్యలు..
ఢిల్లీలో వరదలకు ప్రధాన కారణం వర్షపు నీరు భూమిలో ఇంకకపోవడమే. నగరమంతా సీసీ రోడ్లు ఉండడంతో నింగి నుంచి నేతపై పడిన ప్రతీ నీటిచుక్క రోడ్లపైనే ఉండి వరదలా మారుతోంది. ఇక వరదలకు తగినట్లుగా డ్రెయినేజీలు లేకపోవడం, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా నగరంలో సౌకర్యాలు పెంచకపోవడం కూడా ఢిల్లీలో వరదలకు కారణం అవుతోంది.

మొత్తంగా కాలం ఏదైనా అక్కడి ప్రజలు ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. బిక్కు బిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.