Homeజాతీయ వార్తలు24 గంటల్లో 106 పాజిటివ్‌ కేసులు..6 మంది మృతి

24 గంటల్లో 106 పాజిటివ్‌ కేసులు..6 మంది మృతి

భారత్‌లో 979 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 106 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..ఆరుగురు మరణించారని వెల్లడించింది. దీంతో కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో మృతిచెందిన వారిసంఖ్య 25కు చేరింది. తాజాగా కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. మృతి చెందినవారిలో ఎక్కువగా మధుమేహ వ్యాధి, బీపీ, కిడ్నీ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు ఉన్నట్టు తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

తాజాగా జమ్మూకశ్మీర్‌, గుజరాత్‌లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో మృతుల సంఖ్య జమ్ముకశ్మీర్‌లో రెండుకు, గుజరాత్‌లో ఐదుకు పెరిగింది. అలాగే మహారాష్ట్రలో కొత్తగా మరో 12 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 193కు పెరిగింది. మధ్యప్రదేశ్‌లోనూ కొత్తగా ఐదుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 39కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 86 మంది కోలుకున్నారు.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రుల్లో కరోనా బాధితులు, ఇతర రోగులను వేరుచేసే ప్రక్రియ కొనసాగుతోంది. గూడ్సు రైళ్ల ద్వారా ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, పెట్రోలియం, బొగ్గు సరఫరా చేస్తామని కేంద్రం పేర్కొంది. గత 5 రోజుల్లో 1.25 లక్షల వ్యాగన్ల ద్వారా నిత్యావసర వస్తువుల రవాణా జరిగిందని వెల్లడించింది.

కరోనా నివారణ చర్యలపై మార్గదర్శకాల కోసం 10 బృందాలు ఏర్పాటు చేశారు. గత 24 గంటలలో తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాల్లో కరోనా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 867కు చేరుకున్నది. ఐసోలేషన్‌, క్వారంటైన్‌ సౌకర్యాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా చికిత్సలో పాల్గొంటున్న హెల్త్‌కేర్‌ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం భీమా ప్రకటించింది. రూ.50లక్షల భీమా కోసం కసరత్తు జరుగుతోంది. ఆయుష్‌ విభాగం నిపుణులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. కరోనాతో చనిపోయిన అందరికి ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అవసరమైన మాస్క్‌లు, వెంటిలేటర్లు దిగుమతి చేసుకుంటున్నారు.

ఇప్పటి వరకు 34, 931 మంది అనుమానితుల నమూనాలను పరీక్షించారు. దేశవ్యాప్తంగా టెస్టింగ్‌ ల్యాబ్‌ల సంఖ్య పెంచారు. కరోనా నేపథ్యంలో విధులకు హాజరుకాని ఉద్యోగులు, కార్మికులను తొలగించొద్దని కేంద్రం స్పష్టం చేసింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version