భారత్లో కరోనా వైరస్ ప్రతాపం ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు. మే నెల రెండో వారంలో తీవ్ర స్థాయిలో ఉంటుందని, పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేల వరకూ ఉంటుందని ఒక ప్రముఖ మీడియా సంస్థ, ప్రొటివిటి అనే అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ సంయుక్త అధ్యయనంలో అంచనా వేసింది. దానితో మే చివరి వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మే నెల మధ్యలో కరోనా బాధితుల సంఖ్య పీక్ స్టేజీకి చేరుకొంటుందని ఈ అధ్యయనం సూచించింది. ఆ తర్వాత క్రమంగా బాధితుల సంఖ్య తగ్గుతుందని చెప్పింది. దీని ప్రకారం మే 22 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 75వేల వరకు చేరుకుంటుందని అంచనా వేసింది.
ప్రస్తుతం వివిధ వాతావరణ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉన్నది?, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది?, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాల ఆధారంగా అధ్యయన బృందం మూడు నమూనాలను రూపొందించింది.
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్డౌన్ను మరికొన్ని రోజులపాటు కొనసాగించాలని అధ్యయనం సూచించింది. దేశంలో లాక్డౌన్ మే 3వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్రస్తుతం వైరస్ పునరుత్పత్తి రేటు 0.8గా ఉన్నది. అంటే ఒక కరోనా రోగి నుంచి 0.8 మందికి వ్యాధి వ్యాపిస్తున్నది. దీని ఆధారంగా రెండు అంచనాలను విడుదల చేశారు.
లాక్డౌన్ను మే 15వరకు పొడిగిస్తే సెప్టెంబర్ 15వ తేదీ వరకు రోగుల సంఖ్య సున్నాకు తగ్గుతుంది. ఒకవేళ లాక్డౌన్ను మే 30 వరకు పొడిగించగలిగితే.. జూన్నెల మధ్యలోనే కేసులు సున్నాకు పడిపోతాయని పరిశోధకులు తేల్చారు. ఈ క్రింది మూడు పద్దతులలో ఈ అంచనాలకు వచ్చారు.
పర్సంటేజ్ మోడల్: ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉందో అధ్యయనం చేసి, వీటి ఆధారంగా భారత్లో వైరస్ ఎలా విస్తరిస్తుందో అంచనా వేస్తారు.
ద టైమ్ సిరీస్: చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కరోనా వ్యాప్తి ప్రారంభం, పీక్స్టేజ్, కేసుల సంఖ్య తగ్గుదలకు ఎంత సమయం పట్టిందో విశ్లేషిస్తారు. వాటిని భారత్కు అన్వయిస్తారు.
ససెప్టబుల్ ఎక్స్పోజ్డ్ ఇన్ఫెక్టెడ్ రికవర్డ్: వైరస్ పునరుత్పత్తి రేటు, ఒక్కో కరోనా రోగి సగటున ఎంత మందికి వైరస్ను వ్యాప్తి చేయగలడు? వంటివి సేకరిస్తారు.
ఇలా ఉండగా, భారత్ లో కరోనా కేసుల సంఖ్య 20,000 మార్క్ దాటగా, ఎనిమిది రోజులలో కేసుల సంఖ్య రెట్టింపు అయింది. మరోవంక, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందిన జిల్లాల సంఖ్య గత ఇరవై రోజుల్లో రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కరోనా కేసులు నమోదైన జిల్లాలు ఏప్రిల్ 2 వ తేదీ నాటికి 211 ఉండగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 430కి చేరుకుంది.