
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయనకు ఈరోజు కరోనాగా నిర్ధారణ అయ్యింది. వారం రోజులుగా ఐసోలేషన్ లో ఉన్న పవన్ కు జ్వరం ఒళ్లునొప్పులు, దగ్గు తీవ్రం కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పవన్ ఈరోజు పరీక్షలు చేసుకున్నారు. ఇందులో పవన్ కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో పవన్ కు చికిత్స జరుగుతోందని జనసేన పార్టీ తెలిపింది.
ప్రస్తుతం పవన్ కు జ్వరం, ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్టు.. ఆరోగ్యం నిలకడగా ఉందని జనసేన పార్టీ అధికారికంగా తెలిపింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగెళ్ల సుమన్ హైదరాబాద్ వచ్చి పవన్ గారికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటి వైరల్ మందులతో చికిత్స చేస్తున్నారని.. అవసరమైనప్పుడు ఆక్సిజన్ అందిస్తున్నారని తెలిపారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ ను పరీక్షించిందని.. ఆ వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పవన్ అన్నయ్య చిరంజీవి-సురేఖ, రాంచరణ్-ఉపాసనలు ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేశారని జనసేన తెలిపింది. పవన్ వ్యవసాయక్షేత్రంలోనే పవన్ చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చేశారని తెలిపారు.
వకీల్ సాబ్ ఫంక్షన్ తర్వాత పవన్ సహాయకసిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన నిర్మాత దిల్ రాజు, నటుడు బండ్ల గణేష్ లకు కరోనా సోకి ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలోనే హోం ఐసోలేషన్ లోకి వెళ్లాడు.తాజాగా పవన్ కు లక్షణాలు బయటపడ్డాయి.
ఈనెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్నాక పవన్ వకీల్ సాబ్ ఫంక్షన్ కు హాజరై ప్రసంగించారు. ఆ తర్వాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.