ఆ రెండు రాష్ట్రాల పైనే కాంగ్రెస్‌ ఆశలు

కాంగ్రెస్‌ పార్టీది దశాబ్దాల చరిత్ర. కానీ.. ఇప్పుడు నాయకత్వలోపంతో పార్టీ కోలుకోలేకపోతోంది. పార్టీ వరుస విజయాలతో కుదేలవుతోంది. 2014 నుంచి ఇటు లోక్ సభ, అటు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ చేదు అనుభవాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలను సవాలుగా తీసుకుంది. వీటిల్లో బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులపై పార్టీకి ఎలాంటి ఆశలు లేవు. డీఎంకే గెలిస్తే తమిళనాడు సంకీర్ణంలో భాగస్వామి అవుతుంది. ఇక మిగిలింది […]

Written By: Srinivas, Updated On : March 22, 2021 12:16 pm
Follow us on


కాంగ్రెస్‌ పార్టీది దశాబ్దాల చరిత్ర. కానీ.. ఇప్పుడు నాయకత్వలోపంతో పార్టీ కోలుకోలేకపోతోంది. పార్టీ వరుస విజయాలతో కుదేలవుతోంది. 2014 నుంచి ఇటు లోక్ సభ, అటు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ చేదు అనుభవాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలను సవాలుగా తీసుకుంది. వీటిల్లో బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులపై పార్టీకి ఎలాంటి ఆశలు లేవు. డీఎంకే గెలిస్తే తమిళనాడు సంకీర్ణంలో భాగస్వామి అవుతుంది. ఇక మిగిలింది కేరళ, అసోం. అధికార పార్టీని ఓడించి విపక్షాన్ని గద్దెనెక్కించడం దక్షిణాది రాష్ర్టమైన కేరళలో సంప్రదాయంగా వస్తోంది. అందుకే ఈ రాష్ట్రంపై కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెంచుకుంది.

అసోంను కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ కాలం ఏలింది. 2016లో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని వదలుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలను కైవసం చేసుకునే దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. ఆ మేరకు పకడ్బందీ కార్యాచరణను కూడా రూపొందించింది. కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడ గెలుపు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో పర్యటనలు చేశారు. సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ను ఓడించేందుకు కాంగ్రెస్ కురువృద్ధుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌ను పరిశీలకుడిగానూ నియమించారు. ఆయనకు సహాయపడేందుకు కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర్, గోవాకు చెందిన లూయిజిన్హో ఫెలీర్ లను నియమించింది.

పరమేశ్వరన్ దళిత నాయకుడు. ఫెలీరో క్రైస్తవ నాయకుడు. కేరళలో ఈ సామాజిక వర్గం ఎక్కువ. అందువల్లే వీరిని ఎంపిక చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్‌. వీరితోపాటు రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రులు ఏకే ఆంటోనీ, ఉమెన్ చాందీ, పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్, సీఎల్పీనేత రమేష్ చెన్నితల వంటి ఉద్ధండులు ఉన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 20కి కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 19 సీట్లు గెలుచుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ ఊపుతో అసెంబ్లీ ఎన్నికలను దున్నేయాలని హస్తం పార్టీ అంచనా వేసింది. కానీ.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిల పడిపోవడంతో ఆశలన్నీ గల్లంతయ్యాయి.

ఇక ఈశాన్య భారతంలోని అసోంపైనా హస్తం పార్టీ గట్టి ఆశలే పెట్టుకుంది. 2001 నుంచి 2016 వరకు వరుసగా మూడు దఫాలు పార్టీని విజయపథాన నడిపించిన మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ లేకపోవడం పార్టీకి పెద్దలోటు. ఆయన గతేడాది నవంబరులో కన్నుమూశారు. అయినప్పటికీ తన శక్తియుక్తులను కూడదీసుకుని పార్టీ ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగల్‌ను రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా నియమించింది. ఆయనకు సహాయపడేందుకు ఇద్దరు ముస్లిం నేతలు ముకుల్ వాస్నిక్ (మహారాష్ట్ర), షకీల్ అహ్మద్ (బిహార్) లను నియమించింది. ఛత్తీస్ గఢ్ లో పదిహేనేళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడి హస్తం పార్టీని గద్దెనెక్కించడంలో భగేల్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించారు.