Bhadrachalam kcr : భద్రాద్రి నవమి వేడుకల కోసం విరాళాలు.. కేసీఆర్ ధనిక రాష్ట్రంలో అడుక్కుంటున్న ‘శ్రీరాముడు’

Bhadrachalam kcr : నేను పెద్ద హిందువును. మిగతావాళ్ళంతా బొందుగాళ్లు. యాదిద్రి గుడిని అభివృద్ధి చేశా. బీజేపీ వాళ్లు మత పిచ్చివాళ్లు. రాముడితో రాజకీయం చేస్తారు అంటాడు కేసీఆర్‌. ఒక్క యాదాద్రి మినహా( రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం అభివృద్ధి చేశారు అనే ఆరోపణ) ఒక్క గుడి కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఓ వేములవాడ, భద్రాద్రి, తాజాగా కొండగట్టు.. ఇలా హామీలు కోట్లు దాటాయి గానీ ఒక్క రూపాయి రాలేదు. చివరకు ఆ భద్రాద్రి రాముడికి […]

Written By: NARESH, Updated On : February 26, 2023 8:18 pm
Follow us on

Bhadrachalam kcr : నేను పెద్ద హిందువును. మిగతావాళ్ళంతా బొందుగాళ్లు. యాదిద్రి గుడిని అభివృద్ధి చేశా. బీజేపీ వాళ్లు మత పిచ్చివాళ్లు. రాముడితో రాజకీయం చేస్తారు అంటాడు కేసీఆర్‌. ఒక్క యాదాద్రి మినహా( రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం అభివృద్ధి చేశారు అనే ఆరోపణ) ఒక్క గుడి కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఓ వేములవాడ, భద్రాద్రి, తాజాగా కొండగట్టు.. ఇలా హామీలు కోట్లు దాటాయి గానీ ఒక్క రూపాయి రాలేదు. చివరకు ఆ భద్రాద్రి రాముడికి కేంద్రం ఇచ్చిన ప్రసాద్‌ పథకమే దిక్కయింది. మొన్న రాష్ట్రపతి వచ్చినప్పుడు కొద్దోగొప్పో అభివృద్ధి పనులు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాముడి క్షేత్రంలో జరిగినని ఏమైనా ఉన్నాయా అంటే అవి మాత్రమే. అప్పట్లో 2015లో శ్రీరామనవమికి కేసీఆర్‌ వచ్చినప్పుడు భద్రాద్రి అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించాడు. కానీ ఇంత వరకూ పైసా రాలేదు. జీతాలకే కటకటగా పరిస్థితి ఉంటే ఇక నిఽఽధులేం వస్తాయి.

మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు, 30న రామయ్య తిరుకల్యాణ మహోత్సవం, 31న 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వడం లేదు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సుమారు రూ2.50 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ఇందులో రూ.1.24 కోట్లు ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్ల కోసం వెచ్చించనున్నారు. ఇంత భారీ ఎత్తున చేపట్టే ఉత్సవాలకు ప్రభుత్వం కనీసం ఆర్థిక సహకారం అందించకపోవడం, దేవస్థానానికి భారమవుతోంది. ఈ నేపధ్యంలోనే దేవస్థానం చరిత్రలో తొలిసారిగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పనులకు సంబంధించి భక్తుల నుంచి విరాళాలు కోరుతోందంటే పరిస్థితి ఏ రీతిన ఉందో అవగతమవుతోంది. ఇప్పటికే సామాజిక మాద్యమాల్లో దేవస్థానం పేరిట కరపత్రం విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

రామయ్యకు మీ సహకారం కావాలి

మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించే వసంత ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చేపట్టే పనులకు భక్తులు వివరాలు ఇవ్వాలని కోరుతూ కరపత్రాలను దేవస్థానం అధికారులు ఆదివారం విడుదల చేశారు. ఇందులో 12 అంశాలకు సంబంధించి చేపట్టే వివిధ పనుల వివరాలు, ఖర్చయ్యే మొత్తాన్ని ఉదహరించారు. విద్యుత్తు దీపాలంకరణకు రూ.18 లక్షలు, రుత్విక్‌ సంభావనలకు రూ.10 లక్షలు, పట్టాభిషేక హోమాలు, యాగా లు చేసేందుకు, వసతి, భోజనాలకు రూ.0 లక్షలు, స్వామి వారి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణకు, ఆలయం, కల్యాణ మండపం పూల అలంకరణకు రూ.8 లక్షల చొప్పున, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం సందర్భంగా యాగశాల ఏర్పాటుకు, శ్రీరామనవమి, పట్టాభిషేకం రోజు నిత్యాన్నదానానికి రూ.5 లక్షలు చొప్పున రెండు పనులకు, చలువ పందిళ్ల ఏర్పాటుకు రూ.4 లక్షలు, ఆర్చిగేట్ల నిర్మాణానికి రూ. 4 లక్షలు, పది రోజుల పాటు హోమ ద్రవ్యాల కోసం రూ.3 లక్షలు. ఈ పనులను త్వరగా చేపట్టి పూర్తి చేసేందుకు భక్తులు తమ శక్తి మేరకు విరాళాలను అందజేయాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఆలయ పర్యవేక్షకులు 9705192935, కార్యాలయంలో 08743-232426 లో సంప్రదించాలని వివరిస్తున్నారు.

సమీక్షలకే పరిమితం

ప్రోటోకాల్‌ కోసం…..అధికార పార్టీ పెద్దల మెప్పు కోసం, నవమి సమయంలో హడావుడి చేసేందుకు పోటీ పడే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు భద్రాచలంలోని రామాలయానికి నిధులు రాబట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. రాష్ట్రంలో యాదగిరిగుట్ట, వేములవాడ, కొండగట్టు, కొమరవెల్లి, మేడారం ఇలా పలు దేవాలయాల అభివృద్దికి, అక్కడ జరిగే ముఖ్య ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు భద్రాచలంకు మాత్రం ఒక్క పైసా ఇవ్వడం లేదు. చివరకు నవమి రోజున రామయ్యకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలకు ఇచ్చే రూ.15 వేలు సైతం ప్రభుత్వం దేవస్థానం ఖజానాకు జమ చేయడం లేదు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలకు రూ.లక్ష వరకు బడ్జెట్‌ పెంచుతామని దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా అది ఆచరణకు నోచుకోవడం లేదు.