CM Jagan: ఐదుగురు సిట్టింగులకు ఝలక్ ఇచ్చిన సీఎం జగన్

CM Jagan: నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఒక లోక్ సభ తో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన మార్పుల వివరాలను ప్రకటించారు.

Written By: Dharma, Updated On : January 19, 2024 10:45 am

Jagan

Follow us on

CM Jagan: జగన్ మరో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చారు. గురువారం రాత్రి నాలుగో జాబితాను విడుదల చేశారు. కొవ్వూరు నుంచి గోపాలపురానికి హోంమంత్రి వనితను బదిలీ చేశారు. మంత్రి నారాయణస్వామిని చిత్తూరు లోక్ సభకు, ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరుకు స్థానచలనం కల్పించారు. ఇప్పటివరకు 53 మందిని మార్చగా.. తాజాగా ఐదుగురు మార్పుతో వీరి సంఖ్య 58 కి చేరుకుంది. అయితే ఇంకా ఉత్తరాంధ్ర పై దృష్టి పెట్టలేదు. మలి జాబితాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేల మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఒక లోక్ సభ తో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన మార్పుల వివరాలను ప్రకటించారు. ఇందులో ఒక్క కనిగిరి తప్ప మిగిలినవన్నీ ఎస్సి నియోజకవర్గం వర్గాలే కావడం గమనార్హం. చిత్తూరు లోక్ సభ సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పను మార్చారు. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియమించారు.గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి రెడ్డప్పను ఇన్చార్జిగా నియమించారు. సింగనమలకు ఎం వీరాంజనేయులు, నందికొట్కూరు కు దారా సుధీర్, తిరువూరుకు నల్లగట్ల స్వామి దాసు, మడకశిరకు ఈర లకన్న, కొవ్వూరు కు తలారి వెంకట్రావు, గోపాల పురానికి తానేటి వనిత, కనిగిరి కి దద్దాల నారాయణ యాదవ్ లను నియమించారు.

ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఏకంగా ఐదుగురిపై వేటు వేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే ఎస్సీ నియోజకవర్గాల్లో సీఎం సొంత సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువైంది అన్న విమర్శ ఉంది. వారి ఫిర్యాదులతోనే పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది. నందికొట్కూరులో స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ బాగానే పనిచేసినా..ఆయన మార్పు వెనుక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అటు సిద్ధార్థ రెడ్డి సూచించిన వ్యక్తిని కూడా జగన్ ప్రాధాన్యం ఇవ్వలేదు. తన సొంత మనిషిని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సిద్ధార్థ రెడ్డి సైతం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

గత ఐదు సంవత్సరాలుగా ఎస్సీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పని చేసుకోనివ్వలేదని విమర్శ ఉంది. అటువంటి చోట్ల ఇతర నాయకుల ప్రమేయం అధికంగా ఉంది. ఇప్పుడు వారి చేసిన తప్పిదాలకు ఎస్సీ ఎమ్మెల్యేలు బలి అయ్యారు. వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నా.. సీఎం సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలను మార్చకపోవడం పై మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలను బలి పశువుల చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరు నాయకులపై వేటు వేసి.. జగన్ చేతులు దులుపుకున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై మాత్రం పెద్ద ఎత్తున వేటు వేస్తుండడాన్ని ఆ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. చాలామంది ఎమ్మెల్యేలు లోలోపల రగిలిపోతున్నారు. ప్రత్యామ్నాయాల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.