Chandrababu: ప్రజల భవిష్యత్ కు తాను గ్యారెంటీ అంటున్న చంద్రబాబు.. నమ్ముతారా?

చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఇక సమయం లేదని పార్టీ శ్రేణులకు తట్టి లేపుతున్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతమయ్యింది.

Written By: Dharma, Updated On : September 3, 2023 10:30 am

Chandrababu

Follow us on

Chandrababu: టిడిపి దూకుడు పెంచింది. ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ” బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ “కార్యక్రమం ప్రారంభమైంది. 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి బృందాలు ప్రతి ఇంటిని సందర్శించి సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను వివరించునున్నాయి. ఇప్పటికే చంద్రబాబు సైతం రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు నేను గ్యారెంటీ అని ప్రకటించారు.

చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఇక సమయం లేదని పార్టీ శ్రేణులకు తట్టి లేపుతున్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతమయ్యింది. ఇప్పుడు మీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట నిర్వహిస్తున్న తాజా కార్యక్రమం కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఇది ప్రజల భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటం కాదని.. తన కుమారుడు లోకేష్ కోసం చేస్తున్న ఆరాటమని వైసిపి ఆరోపిస్తోంది. బాబు భవిష్యత్తు ఏంటో ఆయనకే తెలియదని.. ఇక జనానికి గ్యారెంటీ ఇవ్వడం ఏమిటని వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది.

చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఇప్పటికీ రోడ్డు పైకి రావడం లేదు. నాయకత్వం బలంగా పనిచేస్తున్నా.. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ఏదో తూతూ మంత్రంగా మామ అనిపించేస్తున్నారు. అధికార వైసిపి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఉన్న నిఘా అందరికీ తెలిసిందే. ఎక్కడ హై కమాండ్ కు నివేదికలు వెళ్తాయన్న భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేస్తున్నారు. కానీ టిడిపి విషయానికి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. ఒకటి రెండు చోట్ల… పార్టీకి పట్టున్న గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు కార్యక్రమాల నిర్వహణపై నిఘా పెట్టాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి.

14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు ఒక విధంగా ప్రజలకు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాను చేసింది చెప్పకుండా.. తాను అధికారంలోకి రాకుంటే మీ భవిష్యత్తుకు ముప్పేనని ప్రజలకు భయపెట్టినట్టు ఉందని చంద్రబాబు పై సెటైర్లు పడుతున్నాయి. ముందు తాను ఏం చేశానో.. ఏం చేయబోతున్నానో చంద్రబాబు క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ కార్యక్రమం విఫలమయ్య అవకాశాలు కనిపిస్తున్నాయి.