Homeఆంధ్రప్రదేశ్‌AP development : సీమ కష్టాలు తీర్చిన కేంద్రం.. ఏకంగా ఆ 9 కేటాయింపులు

AP development : సీమ కష్టాలు తీర్చిన కేంద్రం.. ఏకంగా ఆ 9 కేటాయింపులు

AP development : ఏపీకి కేంద్రంలోని బీజేపీ సర్కారు మరో శుభవార్త చెప్పింది. తొమ్మిది జాతీయ రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయలసీమలో 411 కిలోమీటర్ల మేర నిర్మించనున్న హైవేలకు ఏకంగా 9,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర రవాణా శాఖ ఆమోదముద్ర వేసింది. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేలా కేంద్రం జాతీయ రహదారుల నిర్మాణంచేపట్టాలని నిర్ణయించింది. వాటికి ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా కేంద్రం నిధులు విడుదల చేయడమే కాకుండా.. పనులు పట్టాలెక్కించేందుకు రోజుల వ్యవధిలో భూమిపూజకు సిద్ధపడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్ది నెలల కిందట విజయవాడ వేదికగా చేసుకొని రూ.15 వేల కోట్లతో నిర్మించనున్న రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, సీఎం జగన్ సంయుక్తంగా భూమిపూజ చేశారు.

రాయలసీమలో పర్యాటకాభివృద్ధికి కీలకంగా భావిస్తున్న రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లిన వెంటనే కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారుల వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి, పిలేరు, తిరుపతిని కలుపుతూ 94 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.2,899 కోట్లు కేటాయించారు. మైదకూరు—, బద్వేలు సెక్షన్ 45 కిలోమీటర్ల నాలుగులేన్ల రహదారికి రూ.1,064 కోట్లు, నాయుడుపేట, తూర్పుకనుపూరును కలుపుతూ 35 కిలోమీటర్ల ఆరులేన్ల రహదారికి రూ.1399 కోట్లు, చిల్లకూరు క్రాస్, కృష్ణపట్నం పోర్టు దక్షిణ గేటును కలుపుతూ 36 కిలోమీటర్ల ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.909 కోట్లు, తమ్మినపట్నం నుంచి కృష్ణపట్నం పోర్టు వరకూ ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.609 కోట్లు, తాడిపత్రి నుంచి ముద్దనూరు వరకూ 51 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.724 కోట్లు, బి.కొత్తపల్లి నుంచి గోరంట్ల వరకూ 57 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.840 కోట్లు, ముదిరెడ్డిపల్లి నుంచి కడప జిల్లా సరిహద్దు వరకూ 36 కిలోమీటర్ల రెండు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.279 కోట్లు, కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దు నుంచి సీఎస్ పురం వరకూ 41 కిలోమీటర్ల రెండులేన్ల రహదారికి రూ.286 కోట్లను కేంద్ర రవాణా శాఖ కేటాయించింది.

ఈ నెల 28న తిరుపతిలో ఈ రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో పాటు సీఎం జగన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే రూ.204 కోట్లతో నిర్మించిన 19 కిలోమీటర్ల మేర రహదారును సైతం ఇదే వేదిక నుంచి ప్రారంభించనున్నారు. అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఏపీ పర్యటన ఖరారైంది. 27న ఆయన తిరుమల చేరుకోనున్నారు. 28 న శ్రీవారిని దర్శించుకొని భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మౌలిక వసతులు, రహదారుల నిర్మాణంలో సంపూర్ణ సహకారం అందిస్తామని కొద్ది రోజుల కిందట గడ్కరి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా కీలక ప్రాజెక్టులను ప్రకటించడమే కాకుండా.. జాప్యం జరగకుండా పనులకు శ్రీకారం చుడుతుండం విశేషం.

ఇప్పటివరకూ విభజన హామీలు అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. అసలు కేంద్రం ఎటువంటి ప్రాజెక్టులు మంజూరు చేయలేదని రాష్ట్రంలో అధికార వైసీపీ సైతం నేరుగా కాకున్నా తెరవెనుక ఆరోపణలు చేస్తూ వచ్చింది. దానిని చెక్ చెబుతూ కేంద్రం ఏపీకి ప్రత్యేక హైవే ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఈ తొమ్మిది జాతీయ రహదారుల నిర్మాణంతో దాదాపు రాయలసీమ స్వరూపమే మారనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. పర్యాటకాభివృద్ధితో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. అటు ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. ఏపీకి కేంద్రం ఏమీ చేయడం లేదన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular