AP Crime : ఏపీలో వైసీపీ నేతల దారుణం.. భర్త ఇంటిఎదుటే భార్య శవం పూడ్చివేత

అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ ఘటన వైరల్ కావడంతో పార్టీకి డ్యామేజ్ జరిగింది. ముప్పేట విమర్శలు ఎదురవుతున్నాయి.

Written By: Dharma, Updated On : October 31, 2023 6:39 pm
Follow us on

AP Crime : ఎక్కడైనా సమస్యలు ఉంటే పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత నాయకులదే. కానీ నాయకులే సమస్యలు సృష్టించేలా వ్యవహరిస్తే దాన్ని ఏమనాలి? మరింత జఠిలం చేస్తే ఏమనుకోవాలి? లేనిపోని సలహాలు ఇచ్చి పక్కదారి పట్టిస్తే దానిని ఏమని వర్ణించాలి? రెండో భార్య చనిపోతే చూడడానికి రాలేదన్న కారణం చూపుతూ ఆమె మృతదేహాన్ని.. భర్త ఇంటి ఎదుటే పూడ్చి పెట్టమన్నారు అధికార వైసీపీ నేతలు. చిత్తూరు జిల్లా కుప్పంలో వెలుగు చూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

కుప్పం మండలం మల్లనూరు పంచాయితీ సింగార పురం గ్రామానికి చెందిన చెన్నయ్యన్ కు ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో రెండో భార్య రత్నమ్మ గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇటీవల అనారోగ్యం బారిన పడింది. శనివారం మృతి చెందింది. అయితే ఆమెను చూసేందుకు చెన్నయ్యన్ రాలేదు. దీంతో ఆగ్రహించిన బంధువులు స్థానిక వైసీపీ నాయకులను ఆశ్రయించారు. వారిచ్చిన సలహా, సాయంతో రత్నమ్మ మృతదేహాన్ని చెన్నయ్యన్ ఇంటి ఎదుట పూడ్చివేశారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంట్లో చెన్నయ్యన్ లేడు.

ఈ విషయం తెలుసుకున్న చెన్నయ్యన్ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నాడు. సోమవారం కుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎక్కడైనా గ్రామస్థాయి నేతలు సమస్యకు పరిష్కార మార్గం చూపుతారు. కుటుంబ తగాదాలు అయితే.. అందర్నీ దగ్గరకు పిలిచి మాట్లాడుతారు. అయితే ఇక్కడ మాత్రం కనీస విచారణ చేపట్టకుండా.. మృతదేహాన్ని భర్త ఇంటి ఎదుట పూర్తి వేయాలని సలహా ఇవ్వడం విశేషం. స్థానిక వైసీపీ నేతల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి వారి వ్యవహార శైలి తోనే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి. దీనిపై వైసీపీ జిల్లా నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ ఘటన వైరల్ కావడంతో పార్టీకి డ్యామేజ్ జరిగింది. ముప్పేట విమర్శలు ఎదురవుతున్నాయి.