BRS Vs Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార బీఆర్ఎస్.. ప్రత్యర్థులపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమను ఓడిస్తారని అనుమానం ఉన్న నేతలను అస్త్రసన్యాసం చేయించేలా పావులు కదుపుతోంది. అన్ని పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కోవర్టుల సాయంతో ప్రత్యర్థుల బలహీనతలను తెలుసుకుని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ గ్రాఫ్ను అమాంతం పడగొట్టాడు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను మార్పించడంలో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పాత్ర లేదని చెప్పలే.
ఇప్పుడు రేవంత్పై నజర్..
బీజేపీ గ్రాఫ్ పడిపోతుండడంతో అది ఇక తమకు పోటీ కాదని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. కర్ణాకట ఎన్నికల ఫలితాల తర్వాత దూకుడు పెంచిన కాంగ్రెస్.. బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అంటోంది. రేవంత్రెడ్డి సారథ్యంలో కీలక నేతలను ఆకర్షిస్తోంది. పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్తో ముప్పు పొంచి ఉందన్న భావన గులాబీ బాస్కు తట్టింది. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. దీంతో రేవంత్పై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. రేవంత్ రెడ్డిని .. కాంగ్రెస్ కు కరెక్ట్ కాదని.. ఆయన వల్ల కాంగ్రెస్కు డ్యామేజ్ జరుగుతోదంని బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ ఆవేదన చెందుతూండటం ఇందులో భాగమే.
రేవంత్తోనే ముప్పు..
తెలంగాణలో రేవంత్రెడ్డిని మాత్రమే బీఆర్ఎస్ ప్రత్యర్థిగా అనుకుంటోంది. అందుకే ఆయనే టార్గెట్గా రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఆయనపై నమ్మకం తగ్గించేందుకు ప్రత్యేకమైన వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్ అంశంపై మాట్లాడిన అంశంపై చంద్రబాబు, టీడీపీకి లింక్ పెట్టడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ ప్రస్తావన తీసుకు రావడం ద్వారా బీఆర్ఎస్ ఆశించిన రాజకీయ ప్రయోజనం.. కేవలం రేవంత్రెడ్డిపై హైకమాండ్ విశ్వాసం తగ్గించడమేనంటున్నారు.
రాహుల్కు ట్వీట్లు..
శశిథరూర్ విషయంలో కూడా కాంగ్రెస్ మంచిదే.. కానీ రేవంత్ కరెక్ట్ కాదన్నట్లుగా నేరుగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి ట్వీట్లు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ అగ్రనేతలు ఎప్పుడు హైదరాబాద్ లేదా తెలంగాణ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి సరైనచాయిస్ కాదని చెప్పేందుకే కేటీఆర్ ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియాంకా గాంధీ యువ సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న సమయంలో కేటీఆర్ మరోసారి అదే వాదన వినిపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని, గాంధీ భవన్ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుందని అన్నారు.
వ్యూహాత్మకంగానే..
నిజానికి బీఆర్ఎస్ పెద్దలు తమకు ఎదురు నిలుస్తున్న నేతలపై ఇలాంటి వ్యూహమే అమలు చేస్తున్నారు. బండి సంజయ్ను తప్పించిన తర్వాత బీజేపీ రేసులోనుంచి పోయింది. ఒక వేల కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ట్రాప్లో పడితే.. అసలు ఎన్నికలు లేకుండానే బీఆర్ఎస్ గెలిచేసినట్లు అవుతుంది. కానీ కేటీఆర్, బీఆర్ఎస్కు ఉన్నన్ని రాజకీయ తెలివితేటలు ఇతర పార్టీలకు ఉండవని అనుకోవడం అమాయకత్వమే. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి రాజకీయాలు నేర్పాలనుకోవడం.. తాతకు దగ్గులు నేర్పడమేనన్న సెటైర్లు .. కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి.