MLA Rajaiah: సినిమాల్లో ఆస్కార్ ఉన్నట్లు రాజకీయాల్లో కూడా పెడితే బాంగుండు అనిపిస్తుంది కొంతమంది నటన చూస్తే.. మహిళలను కామంతో చూస్తే స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఓవరాక్షన్ చూసిన వారు.. పొలిటికల్ ఆస్కార్ కోసం ఆందోళన చేయడానికి కూడా వెనుకాడరు. అట్లుంటది రాజయ్య తీరు. తరచూ వివాదాల్లో చిక్కడం రాజయ్యకు అలవాటే. వివాదాస్పద వ్యాఖ్యలు కావాలనే చేస్తారు. ఎటమటమైతే.. కాళ్ల బేరానికి వస్తారు. తాజాగా జానకీపురం సర్పంచ్ నవ్య విషయంలో కథ అడ్డం తిరగడంతో విధిలేని పరిస్థితిలో బాధితురాలితోనే కలిసి ప్రెస్మీట్ పెట్టాల్సి వచ్చింది. అయినా బాధితురాలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎవరైనా ఆడవాళ్లను కించపరిస్తే పెట్రోల్ పోసి తగలబెడతానని రాజయ్య ముందే గర్జించింది. సర్పంచ్ పక్కనే కూర్చున్న రాజయ్య.. చచ్చిన పామును ఇంకా ఎందుకమ్మా చంపుతావు అన్నట్లు చూస్తూ ఉండిపోయారు.
మీడియేటర్స్ టీంలు..
అయితే ఒకటి.., రెండు.., మూడు.., నాలుగు.., ఇలా అనేక పర్యాయాలు ఎమ్మెల్యే రాజయ్య మహిళల విషయంలో అసభ్యకరంగా వ్యవహరించారు. విషయమేంటంటే రాజయ్య తన కామవాంఛ తీర్చుకునేందుకు ఏకంగా మీడియేటర్స్ టీం ఏర్పాటు చేసుకున్నట్లు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. రాజయ్య కన్ను పడిన మహిళలతో ఈ మీడియేటర్స్ మాట్లాడి రాజయ్య వద్దకు పంపుతారట. తాజాగా నవ్య ఎపిసోడ్తో రాజయ్య రాసలీలలు ఒక్కొక్కటికా బయటకు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విపక్షాలు, నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. అన్ని విధాలా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఏడుపు డ్రామా..
స్టేషన్ ఘనపూర్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆయనపై వస్తున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో రాజయ్య తాజాగా ఏడుపు డ్రామాకు తెర తీశారు. కరుణపురంలో ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకల్లో బుధవారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే కొందరు దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారని చెప్పుకొచ్చారు. దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని కడియం శ్రీహరిని ఉద్దేశించి సవాల్ విసిరారు. తనకు కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తప్పు చేయలేదట..
తానేమీ తప్పు చేయలేదని రాజయ్య తెలిపారు. అంటే సర్పంచ్ నవ్య కావాలని బహిరంగ ఆరోపణలు చేసినట్లా. తన పరువు కావాలనే తాను తీసుకున్నట్లా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నవ్య ఆధారాలు బయటపెడతాననేసరికి బాధితురాలి ఇంటిముందు వాలిన రాజయ్య.. ఇప్పుడు ఏడుపుతో కొత్త నాటకం షురూ చేశారు. శిఖండి రాజకీయాలతో తన అక్కచెల్లెళ్లతో కూడా ఆప్యాయంగా మాట్లాడలేకపోతున్నాని విలపించారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఏ సర్వే చేసినా తాను ముందు వరుసలో ఉన్నానన్నారు. ఫాదర్ కొలొంబో ఆశీస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ వస్తుందో రాదో అన్న ఆందోళన ఒకవైపు, ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న రాజయ్య వీడియోలు, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతోనే ఆయన భావోద్వేగానికి లోనయ్యారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరి చూడాలి బీఆర్ఎస్ అధిష్టానం ఐదోసారి ఎమ్మెల్యే అయ్యే చాన్స్ ఇస్తుందో లేదో..