AP BJP: పొత్తులపై బీజేపీ లైన్ క్లియర్.. ఫుల్ క్లారిటీ

ఏపీలో బిజెపికి చాలామంది సీనియర్లు ఉన్నారు. పురందేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణు కుమార్ రెడ్డి లాంటి నాయకులు ఎంపీ టికెట్లను ఆశిస్తున్నారు.

Written By: Dharma, Updated On : March 3, 2024 10:33 am
Follow us on

AP BJP: ఏపీలో పొత్తులపై బిజెపి భిన్న సంకేతాలు ఇస్తోంది. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. టిడిపి 94 చోట్ల, జనసేన 5 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు తాజాగా బిజెపి సైతం తన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 195 మంది ఎంపీ అభ్యర్థులను బిజెపి ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది అభ్యర్థులు ఉండడం విశేషం. దీంతో ఏపీలో పొత్తులపై బీజేపీ స్పష్టమైన సంకేతాలు పంపించినట్లు అయ్యింది.

ఏపీలో బిజెపికి చాలామంది సీనియర్లు ఉన్నారు. పురందేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణు కుమార్ రెడ్డి లాంటి నాయకులు ఎంపీ టికెట్లను ఆశిస్తున్నారు. ఎంపీలుగా ఎన్నికై కేంద్రమంత్రి కావాలని ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే తొలి జాబితాలో ఈ నాయకుల పేర్లు ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించినా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్క తెలంగాణకే ప్రకటించారు. తెలంగాణలో 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఏపీలో మాత్రం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడంతో పొత్తుపై స్పష్టమైన సంకేతాలు పంపించింది బిజెపి.

నెల రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బిజెపి అగ్ర నేతలతో సమావేశమయ్యారు. కీలక చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటు విషయమై చర్చించారు. అటు తరువాత పొత్తులు ఒక కొలిక్కి రాలేదు. దీంతో సీట్ల సర్దుబాటు విషయంలో బిజెపితో తేడా కొట్టిందని అంతా భావించారు. పొత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రకరకాల ప్రచారం కూడా జరిగింది. బిజెపి ఒంటరి పోరుకు సిద్ధమైందని కూడా వార్తలు వచ్చాయి.రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను బిజెపి ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటనలో ఏపీని పరిగణలోకి తీసుకోకపోవడం పొత్తుల కోసమేనని బిజెపి ఆగ్రనేతలు సంకేతాలు పంపించారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని.. బిజెపి అగ్రనేతలతో ముఖాముఖిగా సమావేశం అవుతారని.. ఆ తర్వాత సంయుక్తంగా పొత్తుల ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలతో ఒకటి రెండు రోజుల్లో పొత్తులపై ఫుల్ క్లారిటీ రానుంది.