West Bengal Elections 2026: వెస్ట్ బెంగాల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఎక్కడ కూడా అధికార టిఎంసి నేతల్లో ఉత్సాహం కనిపించలేదు. కనీసం వారిలో గెలుస్తామని ఆశ కూడా కనిపించలేదు. దీనిని బట్టి అక్కడ బిజెపి హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ నాయకులు ప్రతిసారి దూకుడు కొనసాగిస్తుంటారు.. ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తుంటారు. అవసరమైతే హింసకు కూడా వెనుకాడరు. ప్రాణాలను కూడా తీస్తారు. ఎందుకంటే అది మమత రాసిన రాజ్యాంగం.. మమత బెనర్జీ గత 15 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రూపొందించిన తన మార్క్ న్యాయం. అవినీతి అక్కడ నిత్య కృత్యం.. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులకు అది సురక్షితమైన షెల్టర్.. మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి అద్భుతంగా అండదండలు లభించాయి. చివరికి ఆధార్ కార్డులు.. ఓటరు గుర్తింపు కార్డులు కూడా అందాయి. దీంతో మమత పార్టీ కి దండిగా ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
కేంద్ర ఎన్నికల సంఘం అక్రమంగా నమోదైన ఓటర్లను ఏరి వేసే కార్యక్రమం చేపట్టింది.. దీంతో చాలామంది అక్రమార్కులు తమ ఓటు హక్కును కోల్పోయారు. ఇది ఒక రకంగా మమతకు గట్టి ఎదురు దెబ్బ. అయితే ఈసారి ఎన్నికలను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి సందర్భంలోనూ మమతకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో తిరుగులేని స్ట్రాటజీని పాటించింది. ఫలితంగా మమత ఏమీ చేయలేని స్థితిలో కూరుకుపోయింది.
మీరు ఆశీర్వదిస్తే ఇలాంటి సభలకు వస్తాను. లేనిపక్షంలో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని ఎన్నికల సభలో మమత వ్యాఖ్యానించిందంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ లో బిజెపి నాయకత్వం ఈసారి ఏకతాటి మీద పని చేసింది. విభేదాలను పక్కనపెట్టింది. సీట్ల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు పాటించింది. అధికార టీఎంసీ నేతల ఆగడాలను ఎక్కడికి అక్కడ అడ్డుకుంది. అందువల్లే బిజెపి ఈసారి అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తంగా 294 స్థానాలు ఉన్నాయి. మెజారిటీ సంస్థలు బిజెపి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాలలో ఎన్డీఏ గెలుపు దాదాపుగా ఖాయం. ఇప్పుడు అదనంగా వెస్ట్ బెంగాల్ కూడా బిజెపి ఖాతాలో చేరుతోంది. ఈ ప్రకారం చూసుకుంటే భవిష్యత్ కాలంలో కేరళ, తమిళనాడులో కూడా బిజెపి జెండా ఎగురుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.