KCR vs BJP : శత్రువు ఎలాంటి వాడయినా.. ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదనేది చాణక్య నీతి చెబుతోంది. వర్తమాన రాజకీయాల్లో అయితే శత్రువుపై ఏ మాత్రం కనికరం చూపే పరిస్థితులు లేవు. బీజేపీ రాహుల్గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించింది. బీ ఆర్ఎస్ తెలంగాణ ఇచ్చిందన్న కృతజ్ఞత లేకుండా కాంగ్రెస్ను అణగదొక్కింది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన మ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. కానీ యాదృశ్ఛికంగా బీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీతో పోరాడుతోంది. ప్రతీ విషయంలో బీజేపీని విమర్శిస్తోంది. కాంగ్రెస్ను తెలివిగా పక్కన పెడుతోంది. అటు బీజేపీ కూడా అంతే. మొత్తానికి రెండు పార్టీలూ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీనిని బలపరిచే ఘటన గురువారం మరొకటి జరిగింది.
తెలంగాణలో కేసీఆర్ తలపండిన రాజకీయ నాయకుడు కాబట్టి, రాజకీయం తప్ప మరొకటి ఆలోచించడు కాబట్టి వైజాగ్ స్టీల్కు సంబంధించి ‘ఆసక్తి వ్యక్తికరణ’ విషయంలో ఒక అడుగు ముందుకే వేశాడు. వేయకపోయినా మీడియాకు ఆ స్థాయిలో లీకులు ఇచ్చాడు. సింగరేణి బృందాన్ని బుధవారం విశాఖపట్టణం పంపాడు. ఏం జరిగిందో తెలియదు కానీ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం విశాఖ పట్టణంలోని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఇప్పటికిప్పుడు వైజాగ్ స్టీల్ను ప్రైవేటీకరించే విషయంలో అంత తొందరగా ముందుకు పోవడం లేదని ప్రకటించారు. దీంతో అధికార నమస్తే తెలంగాణ ‘చూశారా ఇదీ మా సార్ గొప్పతనం’ అంటూ ఉదయం నుంచి ఠాం ఠాం చేస్తోంది.
గతంలోనూ నూతన సాగు చట్టాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఢిల్లీలో రైతులు రెండు నెలల పాటు ధర్నాలు చేశారు. సరే దీని వెనుక ఎవరు ఉన్నారు? ఎందు కోసం చేశారనేది సుస్పష్టం. మొన్న ఆస్ట్రేలియా, బ్రిటన్లో జాతీయ జెండాలు కిందకు దించి ఎవరైతే తమ జెండాలను ఎగరేశారో వారే ఆ ఉద్యమాలకు కర్త, కర్త, క్రియ.. అందులే లేషమాత్రమైనా అనుమానం లేదు. సరే మోదీకి అప్పట్లో యూపీలో గెలవాలి కాబట్టి, ప్రతీప శక్తులు కాచుకుని ఉన్నాయి కాబట్టి ఆ చట్టాల మీద వెనక్కు తగ్గాడు. దేశ రైతులకు క్షమాపణలు చెప్పాడు. తర్వాత యూపీని నెగ్గాడు. కానీ ఈ ఎపిసోడ్లో అంటే మోదీ ఆ చట్టాలను రద్దు చేస్తామని రేపు ప్రకటిస్తామనగా.. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఽఢిల్లీలో ధర్నా చేసింది. ఆఫ్కోర్స్ ఈ చట్టాలకు మొదట్లో బీఆర్ఎస్ జై కొట్టింది. తర్వాత తన రాజకీయ అవసరాల కోసం రైతు ఉద్యమానికి సమ్మతం తెలిపింది. అంతే కాదు ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు రాకేశ్ టికాయత్ను పిలిపించింది. ఇదే రాకేష్ టికాయత్ అంతకు ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని తుర్పారపట్టాడు. ఇక బీఆర్ఎస్ ధర్నా చేసిందో లేదో మరుసటి రోజు కేంద్రం చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈఘనత తమదే అని అప్పట్లో సొంత డప్పు కొట్టుకుంది. ఇక నమస్తే తెలంగాణ అయితే అట్లుంటది మా కేసీఆర్తో అంటూ కవరింగ్ ఇచ్చింది.
కానీ దీన్ని తెలంగాణ బీజేపీ టాకిల్ చేయలేదు. చేయగల సత్తా ఒక్కరికో ఇద్దరికో ఉంది. కానీ వారు ముందుకు వచ్చే లోపు బీఆర్ఎస్ చేయాల్సింది చేస్తోంది. ఇక ఆ పార్టీ సోషల్ మీడియా సరేసరి. ఆ రేవంత్ను చూసి బీజేపీ చాలా నేర్చుకోవాలి. వరుస ప్రెస్ మీట్లతో బీఆర్ఎస్ను ఉతికి ఆరేస్తున్నాడు. హెటిరో, యశోద, కుర్రా శ్రీనివాసరావు భూ కుంభకోణాలను బయట పెట్టాడు. ఆంధ్రజ్యోతి మినహా మిగతా పత్రికలు పెద్దగా ఈ విషయాలకు ప్రయారిటీ ఇవ్వలేదు. ఫర్ డిబేట్ సేక్.. స్టేట్లో బీజేపీలో ఉన్నట్టే సెంట్రల్లోనూ కేసీఆర్కు ఎవరైనా కోవర్టులు ఉన్నారా? లేకపోతే కేసీఆర్ ముందకు వెళ్లగానే కేసీఆర్కు బూస్టప్ ఇచ్చినట్టు కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఏంటి? దాన్ని కేసీఆర్ దాన్ని హైలెట్ చేసుకోవడం ఏంటి? సమ్థింగ్ ఫిషిలాగా కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.