Telangana BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ మోడల్ను చూపుతూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. 2014లో బీజేపీ గుజరాత్ను మోడల్గా చూపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో తెలంగాణ మోడల్ కీలకం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఈమేరకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అంతకంటే ముందు జరిగే తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ను గద్దె దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో మరో ఆరు నెలల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక మోడల్తో బరిలో దిగాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు.
ఏమిటా కర్ణాటక మోడల్..
మరో ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా కర్నాటక మోడల్ నే అమలు చేయాలని బీజేపీ అగ్రనేతలు డిసైడ్ అయ్యారని సమాచారం. చేవెళ్లలో ఇటీవల నిర్వహించిన బహిరంగసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన చూసిన తర్వాత ఇదే అనుమానం మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ను రద్దుచేస్తామని ప్రకటించారు. ముస్లింలకు ఇపుడు తెలంగాణలో అమల్లో ఉన్న 4 శాతం రిజర్వేషన్లు రద్దుచేస్తారట. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని అమిత్ ప్రకటించారు. ముస్లింలకు అమలవుతున్న రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఇలాంటి విధానాన్నే బీజేపీ ప్రభుత్వం కర్నాటకలో అమలుచేంది. కర్నాటకలో ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను బసవరాజ బొమ్మై ప్రభుత్వం రద్దు చేసింది. అలా రద్దుచేసిన రిజర్వేషన్ శాతాన్ని ఒక్కలిగలకు 2 శాతం లింగాయతులకు మిగిలిన 2 శాతం సర్దుబాటు చేసింది.
భారీగా ముస్లిం జనాభా..
తెలంగాణతో పోలిస్తే కర్ణాటకలో ముస్లిం జనాభా అధికంగా ఉంది. అయినా బొమ్మై సర్కార్ వాళ్ల రిజర్వేషన్లను సరిగ్గా ఎన్నికలకు ముందు ఎందుకు రద్దుచేశారో అర్ధంకావటంలేదు. అలాగే 224 సీట్ల అసెంబ్లీలో ఒక్క టికెట్ కూడా ముస్లింలకు కేటాయించలేదు. కర్నాటక బీజేపీలో ముస్లిం నేతలున్నా కూడా ఎక్కడా టికెట్ ఇవ్వలేదు. ఈ రెండు నిర్ణయాలు మే 10వ తేదీన జరగబోయే ఎన్నికల్లో నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయని అందరూ భావిస్తున్నారు. అసలే కర్నాటకలో బీజేపీ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది. దానికి అదనంగా ముస్లిం రిజర్వేషన్ల రద్దు, ఒక్క ముస్లిం నేతకు కూడా టికెట్ ఇవ్వకపోవటంతో మరింత సమస్యగా మారిందని సమాచారం. మరోవైపు సీనియర్లకు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగదీష్ శెట్టర్ లాంటి వాళ్లకు కూడా టికెట్లు దక్కలేదు. దాంతో కొందరు రెబల్ అభ్యర్ధులుగాను మరికొందరు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో చేరి పోటీచేస్తున్నారు.
మొత్తంమీద ఎన్నికల్లో బీజేపీ ఎంత కంపుచేసుకోవాలో అంతా చేసుకుంది. మరి దీనివెనుక మోదీ, అమిత్ షా కు ఏదన్నా వ్యూహం దాగుందేమో అర్థం కావడం లేదు. రిజల్టు ఎలాగుంటుందో తెలియాలంటే మే 13 వరకు ఆగాల్సిందే. అయితే కర్ణాటకలో ఈ వ్యూహం సక్సెస్ అయితే తర్వాత తెలంగాణలో జరిగే ఎన్నికల్లో దానిని అమలు చేయడానికి కమలనాథులు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే అమిత్షా ముస్లిం రిజర్వేషన్ల రద్దు ప్రకటన చేశారని తెలుస్తోంది.