జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు పథకం

జగన్ పెంచిన ఆస్తిపన్నులపై బీజేపీ పోరుబాట పట్టింది. పన్నుల పెంపుదలను కేంద్రంపై రుద్దుతున్న ఏపీ సర్కార్ తీరును ఎండగట్టింది. ఏపీ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆస్తిపన్ను పెంపుపై ఆందోళనలు నిర్వహించారు. కేంద్రంపై నెపం నెట్టి సొమ్ము చేసుకుంటున్న జగన్ తీరును బీజేపీ నేతలు ఎండగట్టారు. తాజాగా బీజేపీ ఎంపీ జీవియల్ నరసింహరావు ఆస్తిపన్నులపై బీజేపీ ఆందోళనల్లో పాల్గొన్నారు. పన్నుల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఎక్కడా పన్నుల పెంపుపై […]

Written By: NARESH, Updated On : June 16, 2021 3:22 pm
Follow us on

జగన్ పెంచిన ఆస్తిపన్నులపై బీజేపీ పోరుబాట పట్టింది. పన్నుల పెంపుదలను కేంద్రంపై రుద్దుతున్న ఏపీ సర్కార్ తీరును ఎండగట్టింది. ఏపీ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆస్తిపన్ను పెంపుపై ఆందోళనలు నిర్వహించారు. కేంద్రంపై నెపం నెట్టి సొమ్ము చేసుకుంటున్న జగన్ తీరును బీజేపీ నేతలు ఎండగట్టారు.

తాజాగా బీజేపీ ఎంపీ జీవియల్ నరసింహరావు ఆస్తిపన్నులపై బీజేపీ ఆందోళనల్లో పాల్గొన్నారు. పన్నుల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఎక్కడా పన్నుల పెంపుపై ఆదేశాలు ఇవ్వలేదన్నారు. అలాగైతే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి కదా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో ఆస్థి పన్నులు పెంచలేదు కదా అని నిలదీశారు.

అప్పులు తీర్చుకొనేందుకు పన్నులు పెంచి కేంద్రంపై నింద మోపుతారా? అని జగన్ సర్కార్ ను జీవీఎల్ ప్రశ్నించారు. కేంద్రానికి పన్నుల పెంపుకు సంబంధం లేదని.. పన్నుల భారంతో ఆర్జన మీకు, అపనింద కేంద్రానిదా? అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలన్నింటికీ మీ స్టికర్లు వేసుకొని, పన్నుల నిర్ణయాన్ని కేంద్రానికి ఆపాదిస్తారా? ఎంత మోసం? అంటూ మండిపడ్డారు. అప్పులు చేసి పన్నులు వేసేది ఏపీ ప్రభుత్వం. అపవాదులు కేంద్ర ప్రభుత్వానికా? అని నిప్పులు చెరిగారు.

పన్నుల పెంపుకు కూడా “జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు పథకం” అని పేరు పెట్టుకోండని జీవీఎల్ ఎద్దేవా చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అంత కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానేనని జీవీఎల్ స్పష్టం చేశారు.

నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్టు కింద ఏపీకి 8.16లక్షల కోట్ల నిధులు పెట్టుబడులు పెట్టడం జరుగుతోందని జీవీఎల్ అన్నారు. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ కింద ఏపీకి నిధులు ఇచ్చామన్నారు. పియమ్ఏవై కింద రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే జగనన్న కాలనీలు అని మీ పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటారా అని నిలదీశారు.

పన్నుల పేరుతో కరోనా కష్ట కాలంలో ప్రజలపై భారాలు మోపుతారా? అని జీవీఎల్ మండిపడ్డారు. పన్నులు మీరు పెంచుతూ నెపం బీజేపీపై నెడతారా అని ప్రశ్నిస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పెంచుతూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ఈ నిరసనను తీవ్రతరం చేసి ప్రజల సహాయ నిరాకరణ కార్యక్రమంగా చెబుతామన్నారు.