Athma Sakshi Survey: తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. సర్వేలతో పార్టీలు కుస్తీ పడుతున్నాయి. రాబోయే ప్రభుత్వమేమిటనే దానిపై ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నివేదిస్తున్న సర్వేలతో తెలంగాణ సర్కారు తల పట్టుకుంటోంది. మరోవైపు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే అని బీజేపీ నేతలు చెబుతున్న సందర్భంలో ప్రజలు కూడా అధికార మార్పు కోరుతున్నారని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికార మార్పిడి తప్పనిసరని తెలుస్తోంది.

తెలంగాణలో ఎవరికైనా రెండుసార్లు అవకాశం ఇవ్వడం మామూలే. దివంగత ఎన్టీఆర్ కు రెండుసార్లు, వైఎస్ఆర్ కు రెండుసార్లు, కేసీఆర్ కు రెండుసార్లు ఇచ్చారు. ఇక మూడోమారు అధికారం ఇవ్వడం కల్ల. ఇది తెలిసినా కేసీఆర్ మాత్రం తమదే అధికారమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మూడోసారి మాత్రం కేసీఆర్ కు అధికారం దక్కదనే చాలా సర్వేలు చెబుతున్నాయి. అయితే సందట్లో సడేమియాగా ఆత్మసాక్షి అనే సర్వే టీఆర్ఎస్ కే విజయావకాశాలు అని చెప్పడం విశేషం.
గతంలో ఆత్మసాక్షి సర్వేలు నిజమైనా ఉత్తరప్రదేశ్ లో అట్లర్ ప్లాఫ్ అయింది. దీంతో దీని మీద కూడా ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ అని సర్వే ఫలితాలు వెల్లడించడం గమనార్హం. టీఆర్ఎస్ కు 56 నుంచి 59 స్థానాలు, కాంగ్రెస్ కు 37 నుంచి 39 స్థానాలు, బీజేపీకి 14 నుంచి 16 సీట్లు వస్తాయని సర్వే సూచించింది. అసలు కాంగ్రెస్ పార్టీ మనుగడే కష్టంగా మారిన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ కు రెండో స్థానం అని ప్రకటించడం వివాదాలకు తావిస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి ఈసారి చుక్కలే అని స్పష్టమవుతోంది. ఏదిఏమైనా ఓటరు నాడిని పసిగట్టడం అంత తేలికైన విషయం కాదని తెలిసిందే.

రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇటీవల నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయం స్పష్టమైంది. సభకు వచ్చిన జనాన్ని చూసి ప్రధాని మోడీ స్టేజీ మీదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టి ప్రోత్సహించడం చూసిన ప్రజలకు సీన్ అర్థమైంది. బీజేపీ మెల్లగా రాష్ట్రంలో పాగా వేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రజల పక్షాన నిలిచి పోరాడేందుకు సన్నద్ధమవుతోంది. ప్రజా సమస్యలను పట్టించుకోని అధికార పార్టీ టీఆర్ఎస్ ను గద్దె దించడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది.
Also Read:Food Safety and Standards in AP: ఏపీలో ఆహారం తినేవాళ్లందరికీ హెచ్చరిక.. కాస్త ఆగండి..