ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి నూతన చైర్మన్ రానున్నారు. ఇంతవరకు చైర్మన్ గా వ్యవహరించిన షరీఫ్ అహ్మద్ పదవీ విమరణ చేశారు. టీడీపీ హయాంలో 7 ఫిబ్రవరి 2019న షరీఫ్ శాసనమండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయనే కొనసాగారు. మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లు, సీఆర్టీఏ రద్దు బిల్లు విషయంలో నాడు చైర్మన్ తీరు పైన సీఎంతో సహా వైసీపీ అసహనం వ్యక్తం చేసినా ఆయనను తప్పించే ప్రయత్నాలు చేయలేదు. ఇక మండలి నుంచి షరీఫ్ పదవీ విరమణ చేయడంతో కొత్త చైర్మన్ కోసం కసరత్తు జరుగుతోంది.
షరీఫ్ తో పాటుగా బీజేపీకి చెందిన సోము వీర్రాజు, వైసీపీకి చెందిన డీసీ గోవిందరెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ స్థానాలకు కరోనా తగ్గిన తరువాత మాత్రమే ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మూడుతో పాటుగా ఈనెల 18న స్థానిక సంస్థల కోటాలో8 స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏడు టీడీపీకి కాగా వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. నామినేటెడ్ కోటాలో టీడీపీ నుంచి ముగ్గురు వైసీపీ నుంచి ఒకరు పదవీ విరమణ చేయాల్సి ఉంది.
మండలి చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎవరికి అవకాశం దక్కుతుందోనని చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు డిప్యూటీ చైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం సైతం టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం ఈనెల 18తో ముగుస్తుంది. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో సభా నాయకుడిగా సైతం వైసీపీ నుంచి ఖాళీ కనిపిస్తోంది. శాసనమండలి చైర్మన్ గా ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన షరీఫ్ కొనసాగడంతో ఆయన స్థానం రాయలసీమ, మైనార్టీ నేత, హిందూపురం కు చెందిన నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి, చంద్రబాబుకు భద్రతా అధికారిగా పనిచేసిన ఇక్బాల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
డిప్యూటీ చైర్మన్ స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న జంగా కృష్ణమూర్తికి కేటాయించే అవకాశాలున్నాయి. మండలి ఫ్లోర్ లీడర్ గా సీనియర్ అయిన ఉమ్మారెడ్డి పేరు వినిపిస్తున్నా ఆయన రాజ్యసభ ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి అంగీకరిస్తే సి.రామచంద్రయ్యకు ఆ స్థానం దక్కే అవకాశం ఉంది.