Homeఆంధ్రప్రదేశ్‌ముందు పోతే నుయ్యి.. వెనక్కి పోతే గొయ్యి..: ఏపీ ఆఫీసర్ల పరిస్థితి ఇదీ

ముందు పోతే నుయ్యి.. వెనక్కి పోతే గొయ్యి..: ఏపీ ఆఫీసర్ల పరిస్థితి ఇదీ

Panchayat Elections
ఏపీలో ప్రభుత్వం వర్సెస్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ అన్నట్లుగా నడుస్తోంది. ఈ రెండు వ్యవస్థల కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో ఆఫీసర్లు నలిగిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పిన పని చేయకపోయినా.. వీరి పేరుతో వారు చేసేసినా కామ్‌గా ఉండకపోయినా శంకరగిరి మాన్యాలు పడతాయి. అలాగని వారు చెప్పినట్లుగా వింటే ఏమవుతుందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. గతంలో చాలా మంది ఐఏఎస్ అధికారులు కేసుల పాలయ్యారు. జైలుకెళ్లారు.

తాజాగా గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ లాంటి వారు అభిశంసనకు గురయ్యారు. ఎవరైనా ఐఏఎస్ అధికారి రాజ్యాంగ వ్యవస్థ చేతిలో అభిశంసనకు గురయ్యారంటే అంతకంటే అవమానం ఉండదు. భవిష్యత్‌లో వారికి ఎలాంటి అవకాశాలు రావు. ద్వివేది, గిరిజాశంకర్‌లను అభిశంసస్తూ ఎస్‌ఈసీ సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయించిన వివరాలు చిన్నవి కావు. సివిల్ సర్వీస్ అధికారి హోదాలో ఉండి.. భారత ప్రజస్వామ్యాన్ని బలహీనం చేసేలా ఉద్దేశపూర్వకంగా ఓటర్ల జాబితాను ప్రచురించలేదని ఆయన చెబుతున్నారు. దీన్ని ఎవరూ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు.

సాధారణంగా ఓటర్ల దినోత్సవం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. కానీ ఈ సారి కోర్టుకు హమీ ఇచ్చి కూడా ద్వివేది, గిరిజాశంకర్‌లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రభుత్వ పెద్దలు అంగీకరించకపోవడం వారిని కాదని.. తాము ఎలాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయత వల్లే ఆ పని వారు చేయలేదు. ఒకవేళ వారిని కాదని ఓటర్ల జాబితా ప్రచురిస్తే.. తర్వాత సస్పెన్షన్ వేటు వేసి కేసులు పెట్టినా పెడతారని భయపడి ఉంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంత మంది సివిల్ సర్వీస్ అధికారులపై అలాగే కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టడంలోనూ ఈ సివిల్ సర్వీస్ అధికారుల పాత్రే ఉంది. ఇప్పుడు అలాంటి ప్లాన్ వారిపైనే అమలు చేసినా ఆశ్చర్యం ఉండదు. అందుకే వారంతా భయపడుతున్నారు.

ప్రస్తుతం బాధితులుగా గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌లు మాత్రమే ఉన్నారు. కానీ.. ముందు ముందు మరింత సివిల్ సర్వీస్ అధికారులు తీవ్ర వివాదాల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే లెక్కలేనన్ని కోర్టు ధిక్కరణ చర్యలకు అధికారులు పాల్పడ్డారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే డీజీపీకే హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసేంత దుర్భరంగా మారిపోయింది. అయినా అధికారులు కళ్లు తెరవలేకపోతున్నారు. తాము ఏం చేస్తున్నామో.. ఏం చేయకూడదో అంచనా వేయలేని స్థితికి వెళ్లిపోయారు. అదే వారికి ముందు ముందు అనేక ఇక్కట్లను తెచ్చి పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version