ఆంధ్ర ప్రదేశ్ లో గత నాలుగైదు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ప్రజలలో ఆందోళన కనిపించడం లేదు. అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారిని కట్టడి చేయడం పోలీసులుకు సాధ్యం కావడం లేదు.
ముఖ్యంగా వైరస్ ఉధృతంగా ఉన్న కర్నూల్, విజయవాడ, గుంటూరు లలో లాక్ డౌన్ నిబంధనలను అమలు జరపడం వారికి సవాల్ గా మారింది. అందుకనే పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిని పోలీస్ వ్యాన్ లలో కాకుండా అంబులెన్సు లలో ఎక్కించడం ప్రారంభించారు. వారిని అంబులెన్స్ లలో పోలీస్ స్టేషన్ లకు కాకుండా నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు పంపుతున్నారు.
‘ఎంత చెప్పినా వినడంలేదు.. లాఠీలు ఎత్తితే ఆరోపణలు వస్తున్నాయి.. వాహనాలు సీజ్ చేస్తే నడుచుకొంటూ రోడ్డెక్కుతున్నారు.. వదిలేద్దామంటే కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే పోలీసు జీపులో స్టేషన్కు కాకుండా అంబులెన్స్ ఎక్కించి క్వారంటైన్ కేంద్రానికి తరలించడమే ఉత్తమం’ అంటూ పోలీసులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.
కర్నూలు, విజయవాడ, గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్ష జరిపినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చాలాచోట్ల ప్రజలు వినడం లేదని, ఆదివారం మాంసం దుకాణాల వద్ద ఎగబడి తోసుకొంటున్నారని, కట్టడి చేయలేక దుకాణాలు మూయించేశామని పోలీసు అధికారులు తమ ఇబ్బందులను చెప్పుకొంటూ వచ్చారు.
దానితో అనవసరంగా బయటికి వచ్చిన వారిని అంబులెన్స్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తే ఫలితం ఉండొచ్చని డీజీపీ ఒక నిర్ణయానికి వచ్చారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికి ఈ-పాస్ తప్పని సరి అనిస్పష్టం చేశారు. వెంటనే సోమవారం నుండే అమలు ప్రారంభించారు.
వెంటనే విజయవాడ లోని కృష్ణలంక, మాచవరంలో పోలీసులు ఉదయం పది గంటల తర్వాత రోడ్లపై కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆపి ఆరా తీశారు. సరైన కారణం, ఆధారం చూపించని వారిని అంబులెన్స్ ఎక్కించి క్వారంటైన్కు పంపారు. అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు సైతం ఆకతాయిలకు ఇదే తరహా పనిష్మెంట్ ఇచ్చారు.