Andhra Pradesh Gold Mines: బంగారం.. కొంతకాలంగా విపరీతంగా ధర పెరుగుతోంది. చివరికి బులియన్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయే విధంగా ధరలో పెరుగుదల కనిపిస్తోంది. అందువల్లే బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు స్థిరాస్తి, ఇతర వాటి మీద ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేవారు. ఇప్పుడు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలిమెంట్ లాగా ఇన్వెస్టర్లు బంగారాన్ని భావిస్తున్నారు.
బంగారం భారీగా లభ్యమయ్యే ప్రాంతాలు ప్రస్తుతం విపరీతంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నాయి. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుతున్నప్పటికీ మనదేశంలో వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రజలు పోటీపడుతున్నారు. ఇతర దేశాల నుంచి భారతదేశానికి విపరీతంగా బంగారం దిగుమతి అవుతుంది. ధర ఈ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా బంగారం దిగుమతి ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల కాలంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం చోటు చేసుకున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బంగారం ధర పెరుగుతూ పోతుంది.
బంగారం ఎక్కువగా ఇతర దేశాలలో లభ్యమవుతూ ఉంటుంది. ఇక మనదేశంలో కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో బంగారం లభిస్తుంది. కోలార్ ప్రాంతంలో బంగారు గనులను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా బంగారు గనులు వెలుగులోకి వచ్చాయి. అవి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ గనుల్లో బంగారం తవ్వకం మొదలైతే ఏపీ దిశ దశ మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో తొలి ప్రైవేట్ బంగారు గని త్వరలో ప్రారంభం కాబోతోంది. మే నెల తొలి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభిస్తారు. జియో మైసోర్ సర్వీసెస్ ఇండియా కంపెనీ ఈ గనుల్లో బంగారాన్ని వెలికి తీయడానికి ప్రధాన డెవలపర్ గా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు మొత్తం 598 హెక్టార్ల విస్తరించి ఉంది. 2027 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 600 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయడాన్ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ విస్తరించి ఉన్న గనుల్లో 13.1 టన్నుల బంగారం విలువలు ఉన్నట్లు తెలుస్తోంది. 10 సంవత్సరాల పాటు ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. గరిష్టంగా 1000 కిలోల వరకు బంగారాన్ని ఉత్పత్తి చేస్తారని తెలుస్తోంది.