ఒకే వేదికపై పవన్ కళ్యాణ్-బీజేపీ నేతలు.. కథేంటి?

ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగిన ఏపీ బీజేపీ, జనసేనల మధ్య సయోధ్య కుదిరిందా? ఇక ఉమ్మడిగా ఈ రెండు పార్టీలో ఏపీలో పోరాడనున్నాయా? పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతల మీటింగ్ తో ఇది కార్యరూపం దాల్చుతుందా? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా ఏపీ బీజేపీ ముందుకెళుతోంది. నిరసనలు, ఆందోళనలతో అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలపై పోరుబాట పడుతోంది. […]

Written By: NARESH, Updated On : August 15, 2021 11:35 am
Follow us on

ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగిన ఏపీ బీజేపీ, జనసేనల మధ్య సయోధ్య కుదిరిందా? ఇక ఉమ్మడిగా ఈ రెండు పార్టీలో ఏపీలో పోరాడనున్నాయా? పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతల మీటింగ్ తో ఇది కార్యరూపం దాల్చుతుందా? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి.

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా ఏపీ బీజేపీ ముందుకెళుతోంది. నిరసనలు, ఆందోళనలతో అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలపై పోరుబాట పడుతోంది. ప్రజల సమస్యలపై పోరాడుతోంది.

అయితే ఇన్నాళ్లు ఏపీ బీజేపీ మాత్రమే ఈ పోరాటం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో తీవ్రంగా పోరాడుతున్నారు. నిజానికి బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నా ఎవరి దారి వారిదే అన్నట్లుగా రెండు పార్టీల తీరు కొనసాగుతోంది. ఎవరి కార్యక్రమాలు వారు కొనసాగిస్తున్నారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై పోరాటం విషయంలో ఎవరి అజెండా వారు అమలు చేస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే తిరిగి జనసేన అధినేత పవన్ తో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. విజయవాడకు వచ్చిన పవన్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, నేతలు పురంధేశ్వరి, సునీల్ ధియేధర్, తదితరులు ఏపీలోని రాజకీయ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు.

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని.. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నేతలు నిర్ణయించారు. మరింతగా ఆర్థికంగా దిగజారకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఇక జగన్ పాలనపై ఇకపై ఉమ్మడిగానే పోరాటం చేయాలని.. కార్యక్రమాలపై చర్చించి నిర్ణయించేందుకు త్వరలోనే రెండు పార్టీల ముఖ్య నేతలు మరోసారి సమావేవం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ, తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికల్లో కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు కలిసే ఇక పోరుబాట పట్టాలని.. అన్ని ఎన్నికల్లోనూ కలిసి కట్టుగానే పోరాడాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

చాలా రోజుల గ్యాప్ తర్వాతే బీజేపీ, జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశం జరగడంతో రెండు పార్టీలు ఇక కలిసి ముందుకు సాగుతాయా? లేక మళ్లీ పాత దారిలోనే వెళుతాయా? అన్నది వేచిచూడాలి. ఈ మీటింగ్ తో మాత్రం బీజేపీ, జనసేన ఒక్కటే అన్న సంకేతాన్ని పార్టీ శ్రేణుల్లోకి పంపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏపీ ఆందోళనల్లో పాల్గొనే అవకాశం అయితే లేదు. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే బీజేపీతో కలిసి పోరాటం చేసేందుకు జనసేన పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఇన్నాళ్లు విడివిడిగా సాగిన బీజేపీ, జనసేన సంసారం ఇకపై ఏపీలో కలిసి కట్టుగా చర్చించుకొని పోరాటాలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మరి ఇది సాధ్యమవుతుందా? సాగుతుందా? అన్నది వేచిచూడాలి.