Homeజాతీయ వార్తలుAmbedkar Jayanti 2025: బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌.. కులవివక్ష నుంచి రాజ్యాంగ రూపశిల్పి వరకు..!

Ambedkar Jayanti 2025: బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌.. కులవివక్ష నుంచి రాజ్యాంగ రూపశిల్పి వరకు..!

Ambedkar Jayanti 2025: చదువంటే అపారమైన ఇష్టం, జ్ఞానం సంపాదించాలనే తపనతో ఒక చిన్నారి పాఠశాలలో అడుగుపెట్టాడు. కానీ, తొలిరోజే అతడిని మూలన కూర్చోబెట్టారు, గోనె సంచిపై ఒంటరిగా కూర్చోమన్నారు. ఒక రోజు జరిగిన ఈ అవమానం ప్రతిరోజూ కొనసాగింది. తన కులం కారణంగా ఈ వివక్ష జరుగుతోందని తెలిసినప్పుడు ఆ బాలుడి మనసు గాయపడింది. అయినా, ఆ అవమానాలను సవాలుగా స్వీకరించి, విద్యాపరంగా అసాధారణ ఎత్తులకు ఎదిగాడు. ఆ బాలుడే భారత రాజ్యాంగ రూపశిల్పి, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌.

Also Read: స్వాతంత్రోద్యమ చరిత్రకెందుకు ఇన్ని వక్రభాష్యాలు

1891 ఏప్రిల్‌ 14న మహారాష్ట్రలోని మహూ(Mahoo) గ్రామంలో జన్మించిన భీమరావ్‌ రామ్‌జీ అంబేడ్కర్(Bheem Rao ramjee Ambedkar), మహర్‌(Mahar) కులంలో పుట్టినందున చిన్నతనం నుంచే కులవివక్షను ఎదుర్కొన్నారు. చదువుకు అపారమైన ఆసక్తి ఉన్న భీమ్‌ను తండ్రి సతారాలోని ఒక పాఠశాలలో చేర్చారు. అయితే, ఆ రోజుల్లో ‘‘అస్పృశ్యులు’’గా పరిగణించబడే వారిని తరగతిలో ఇతర విద్యార్థులతో కలిసి కూర్చోనివ్వరు. భీమ్‌(Bheem)ను ఒక మూలన గోనె సంచిపై కూర్చోమని ఆదేశించారు. ఈ సంచిని ప్రతిరోజూ ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి తిరిగి తీసుకురావాల్సి ఉండేది, ఎందుకంటే పాఠశాల సిబ్బంది దాన్ని తాకేవారు కాదు. ఈ వివక్ష ఒక్క గోనె సంచితో ఆగలేదు. తాగునీటి కోసం కూడా భీమ్‌ గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇతర విద్యార్థులు కుండ నుంచి నీళ్లు తాగగలిగినా, అంబేడ్కర్‌ వంటి నిమ్న కులాల విద్యార్థులకు అది నిషేధం. ప్యూన్‌ వచ్చి, తాకకుండా ఎత్తు నుంచి నీళ్లు పోసేవాడు. ఒక రోజు ప్యూన్‌ రాకపోతే, దాహంతో బాధపడిన సంఘటనలు కూడా ఉన్నాయి.

అవమానాల మధ్య చదువు..
ఈ వివక్ష సామాన్య బాలుడిని నిరాశపరచి ఉండవచ్చు, కానీ భీమ్‌లో చదువంటే ఉన్న ఆసక్తిని ఆపలేకపోయింది. తండ్రి రామ్‌జీ సాక్పల్, బ్రిటిష్‌ ఆర్మీ(Brithish Army)లో సుబేదార్‌గా ఉండటం వల్ల, కుటుంబానికి కొంత ఆర్థిక స్థిరత్వం ఉండేది. ఈ సహకారంతో భీమ్‌ ముంబై(Mumbai)లోని ఎల్ఫిన్‌స్టోన్‌ హైస్కూల్‌లో చేరారు. అక్కడ కూడా వివక్ష ఎదురైనా, తన పట్టుదలతో 1907లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. ఇది ఆ రోజుల్లో మహర్‌ కులంలో అరుదైన విజయం. అంబేడ్కర్‌ విద్యావిషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. బరోడా మహారాజా సాయాజీరావ్‌ గైక్వాడ్‌ ఆర్థిక సహాయంతో, 1913లో అమెరికా(America)లోని కొలంబియా విశ్వవిద్యాలయం(Colambia University)లో చేరారు. అక్కడ ఆర్థికశాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో మాస్టర్స్‌ డిగ్రీ, తర్వాత డాక్టరేట్‌ సాధించారు. ఆ తర్వాత లండన్‌లోని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో మరో డాక్టరేట్, బార్‌–ఎట్‌–లా కోర్సు పూర్తి చేశారు. ఈ విద్యాపరంగా ఆయన సాధించిన ఘనతలు ఆ రోజుల్లో అసాధారణం.

వివక్షను సవాలుగా స్వీకరించి..
అంబేడ్కర్‌ బాల్యంలో ఎదురైన వివక్ష ఆయనను నిరాశపరచలేదు, మరింత దృఢసంకల్పంతో ముందుకు నడిపించింది. కులవివక్ష గురించి ఆయన లోతుగా అధ్యయనం చేశారు. ‘‘కులాల నిర్మూలన’’ (Annihilation of Caste) వంటి రచనల ద్వారా సమాజంలోని అసమానతలను ప్రశ్నించారు. అంబేడ్కర్‌ నమ్మకం ఒక్కటే. విద్య, స్వాతంత్య్రం, సమానత్వం ద్వారా మాత్రమే సమాజం మారుతుంది. అంబేడ్కర్‌ జీవితంలో మరో గుర్తుండిపోయే సంఘటన బరోడా రాష్ట్రంలో ఉద్యోగిగా చేరినప్పుడు జరిగింది. అస్పృశ్యుడని తెలిసిన తర్వాత, సహోద్యోగులు ఆయనతో దూరం పాటించారు. ఫైళ్లను దూరం నుంచి విసిరేవారు, ఆయన కోసం నీళ్లు తాకేవారు లేరు. ఈ అవమానాలు ఆయనలో సామాజిక సంస్కరణల కోసం పోరాట స్ఫూర్తిని రగిల్చాయి.

రాజ్యాంగ రూపశిల్పిగా..
అంబేడ్కర్‌ విద్య, ఆలోచనలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం ఆయనను భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక వ్యక్తిగా నిలిపాయి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఆయన రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి సూత్రాలతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. కులం, మతం, లింగం ఆధారంగా వివక్షను నిషేధించే నిబంధనలు, నిమ్నవర్గాలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక చర్యలు ఆయన చొరవతోనే సాధ్యమయ్యాయి. అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా నిమ్నవర్గాలకు, అణగారిన వర్గాలకు గొంతును ఇచ్చారు. ‘‘విద్య, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం లేనిదే స్వాతంత్య్రం అర్థరహితం’’ అని ఆయన హెచ్చరించారు. ఈ ఆలోచనలు ఈ రోజు కూడా సమాజంలో సంస్కరణలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

అంబేడ్కర్‌ జీవితం నుంచి నీతి
అంబేడ్కర్‌ జీవితం ఒక స్ఫూర్తి. వివక్ష, అవమానాల మధ్య కూడా విద్యను ఆయుధంగా స్వీకరించి, సమాజంలో మార్పు తెచ్చారు. ఆయన సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం, రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులు ఈ రోజు కోట్లాది మందికి ఆధారం. ఆయన జీవితం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. విద్య, దృఢసంకల్పం ఉంటే ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చు.
అంబేడ్కర్‌ మహాపరినిర్వాణం (1956 డిసెంబర్‌ 6) తర్వాత కూడా ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడే వారికి దీపస్తంభంగా నిలుస్తున్నాయి. ఆయన స్థాపించిన బౌద్ధ ధమ్మం, కులవివక్షకు వ్యతిరేకంగా నడిచిన మార్గం ఈ రోజు కూడా సమాజంలో సమానత్వం కోసం ఆలోచించే వారికి స్ఫూర్తినిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version