Passenger Trains: సంపన్నులకే సేవలా? వందేభారత్‌పై మోజు.. ప్యాసింజర్‌ రైళ్లు రద్దు!

కేంద్రం కొన్ని నెలలుగా వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తుంది. ఈ రైళ్లను చాలా ప్రతిష్ఠాత్మకమైనవిగా కేంద్రంలోని బీజేపీ సర్కారు భావిస్తోంది. ఎంతగా అంటే.. ఈ వందేభారత్‌ రైళ్ల ప్రాజెక్టును మాత్రమే కాదు..

Written By: Raj Shekar, Updated On : May 10, 2023 10:49 am

Passenger Trains

Follow us on

Passenger Trains: దేశంలోనే పేద ప్రజలకు సేవలందిస్తున్న ప్రధాన ప్రభుత్వరంగ సంస్థ భారత రైల్వే. నిత్యం లక్షలాది మంది పేదలకు ఇది ఇప్పటికీ చవకైన ప్రయాణ సాధనంగా ఉపయోగపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే.. రైళ్లలో నిత్యం ఎన్నికోట్ల మంది ప్రయాణం చేస్తున్నారో, అందులో కనీసం 50 శాతం మందికిపైగా రిజర్వేషన్లు దొరక్కపోవడం కారణంగా, సీట్లు లేకపోవడం మూలంగా తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఖరీదైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో సేవలను మరింత మెరుగు పర్చాల్సిన రైల్వే సంస్థ కొన్నాళ్లుగా సంపన్నుల సేవలతో తరిస్తోంది. దీనిని మోదీ సర్కార్‌ దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా డప్పు కొట్టుకుంటోంది.

వందే భారత్‌పైనే దృష్టి..
కేంద్రం కొన్ని నెలలుగా వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తుంది. ఈ రైళ్లను చాలా ప్రతిష్ఠాత్మకమైనవిగా కేంద్రంలోని బీజేపీ సర్కారు భావిస్తోంది. ఎంతగా అంటే.. ఈ వందేభారత్‌ రైళ్ల ప్రాజెక్టును మాత్రమే కాదు.. ఏ ఊర్లో కొత్త రైలును ప్రారంభిస్తున్నా.. అక్కడికి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వెళుతున్నారు. వందేభారత్‌ రైళ్లు అనేవి అత్యద్భుతం అని ఆయన ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పేద ప్రజలైతే వందేభారత్‌ రైళ్లలో ప్రయాణం చేయడాన్ని తమ స్తోమతకు మించిన పనిగా భావిస్తారో, ఏ పేదలైతే ఆ ప్రయాణాన్ని కేవలం కలగా కలిగి ఉంటారో అలాంటి పేదలతో మోదీ చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. సంపన్నుల సేవలో తరించే ఈ రైళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

సికిద్రాబాద్‌–తిరుపతి ట్రైన్‌ బోగీల పెంపు..
ఈ క్రమంలో సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య ఇటీవల ప్రారంభించిన వందేభారత్‌ రైల్లో 8 బోగీలు మాత్రమే తొలుత పెట్టారు. రద్దీ ఎక్కువైపోయిందిని, ఆక్యుపెన్సీ రేషియో 120 నుంచి 130 శాతం నమోదు అవుతోందని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే సంపన్నుల సేవార్థం ఆ బోగీల సంఖ్యను రెట్టింపు చేసి 16 బోగీలు ఏర్పాటు చేశారు.

మిగతా రైళ్ల ఆక్యుపెన్సీ మాటేంటి?
ఆక్యుపెన్సీ రేషియో అదనంగా నమోదు కావడం కేవలం వందేభారత్‌కు మాత్రమే జరుగుతున్నదా? పేద ప్రజలకు స్లీపర్, జనరల్‌ బోగీలతో కూడా సేవలందించే మామూలు రైళ్లలో ఆక్యుపెన్సీ రేషియో అదనంగా ఉండడం లేదా? మరి స్లీపర్, జనరల్‌ బోగీల సంఖ్య పెంచడానికి రైల్వే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అలా చేస్తే పేదలు సుఖపడితపోతారని, గతిలేని నిరుపేదలకు ఎక్కువ సేవ చేసినట్లు అవుతుందని సంకోచిస్తున్నారా? అనే తరహా ప్రశ్నలు ప్రజలు సంధిస్తున్నారు.

మరోవైపు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు..
భారత రైల్వేలో ప్యాసింజర్‌ రైళ్లలకు ప్రత్యేక స్థానం ఉంది. పేదలపై అధిక ఆర్థిక భారం పడకుండా చవకైన ఛార్జీలతో గమ్యస్థానాలకు చేర్చే రైళ్లుగా ప్యాసింజర్లకు పేరుంది. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ సాగే ఈ రైళ్లు ఎంతో మందికి దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఎక్కువ ఛార్జీలు వెచ్చించి ప్రయాణించలేని వారంతా ప్యాసింజర్‌ రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ ప్యాసింజర్‌ రైలు బండి ఇకపై కనుమరుగు కాబోతోంది. ప్యాసింజర్‌ రైళ్లను ఎత్తివేసేలా భారత రైల్వే చర్యలు చేపడుతోంది. కొన్ని మార్గాల్లో పూర్తిగా లేకుండా చేస్తోంది. ఇటీవల వరకు ప్యాసింజర్లుగా నడిచిన వాటినే ఇప్పుడు అన్‌రిజర్వ్‌డు ఎక్స్‌ప్రెస్‌లు, స్పెషల్‌ ఫేర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు చేసి, ఛార్జీలు పెంచేసింది.

ఇలా రైల్వేకు పేద, మధ్యతరగతి వారిని దూరం చేస్తూ కేవలం సంపన్నుల సేవలోనే భారత రైల్వే తరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.