Rajasthan Assembly Election 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. దాదాపు 70 శాతం వరకు పోలింగ్ నమోదయింది. 200 అసెంబ్లీ స్థానాలకు గాను.. 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. చదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.మొత్తం 1862 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరి ఫైట్ నడిచింది.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, రాజస్థాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటస్రా, స్పీకర్ సిపి జోషి తదితర హేమాహేమీలు బరిలో నిలిచారు. రాజస్థాన్లో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి రాదన్న సెంటిమెంట్ ఉంది. ఈసారి ఆనవాయితీకి బ్రేక్ పడుతుందా? లేక కొనసాగుతుందా? అన్నది చూడాలి. అయితే ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ, బిజెపి మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఇప్పటికే పలు సర్వేలు తేల్చాయి. కానీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా లోక్ పాల్ సంస్థ ఒక సర్వేను వెల్లడించింది. సవరించిన తుది సర్వే ఫలితాలు అంటూట్విట్టర్ ద్వారా కీలక నెంబర్లను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ 87 నుంచి 93 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని.. బిజెపి 92 నుంచి 98 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే తేల్చింది. అటు ఇతరులు 12 నుంచి 18 సీట్లను దక్కించుకుంటారని వెల్లడించింది. అయితే సోషల్ మీడియాలో మెజారిటీ నెటిజన్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని.. ఆ పార్టీకి 100 సీట్లు పైగా రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం.