జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మి అందలం ఎక్కించిన సీనియర్ నేత మాదాసు గంగాధరం తాజాగా జనసేనకు గుడ్ బై చెప్పారు. ఈ మధ్య జనసేన కమిటీలన్నింటిలోనూ ఈయన పేరే ఎక్కువగా వినిపించేది. ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలుగువెలిగిన ఈ నేత రెండు సార్లు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.
అయితే ఉమ్మడి ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీ అంతర్థానమైపోవడంతో ఇక ఆ పార్టీ నేతలంతా టీడీపీ వైసీపీల్లో చేరారు. కానీ మాదాసు మాత్రం జనసేనలో చేరారు.
అయితే జనసేనాని పవన్ ఈయనకు పెద్దపీట వేశారు. పార్టీలో స్క్రీనింగ్ కమిటీలో చోటుకల్పించారు.టికెట్లు, ముఖ్యమైన సభ వ్యవహారాలను ఈయన పర్యవేక్షించారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోవడం.. పవన్ సైతం రెండు చోట్ల పోటీచేసి ఓడిపోవడంతో పార్టీలో నైరాశ్యం అలుముకుంది.
అప్పటి నుంచి జనసేన నేతలంతా చెదిరిపోతుండగా.. తాజాగా మాదాసు గంగాధరం కూడా పార్టీకి రాజీనామా చేసి వైదొలిగారు. సీనియర్ నేత వైదొలగడం పార్టీకి దెబ్బగా మారింది.