Homeగెస్ట్ కాలమ్రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?

రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?

Farmers

ఇప్పుడు పక్షులూ, కోతులూ, అడవి జంతువులూ ఏ విధంగా ఆహారాన్ని వెతుక్కొంటూ అవి దొరికే చోటుకు వెళుతూ ఉంటాయో….అదే విధంగా, పురాతన కాలంలో కొన్ని వేల యేళ్లకు ముందు మనిషి తన గుంపుతో భూమండలం మొత్తం ఆహార అన్వేషణలో తిరిగే వాడు.

కాల క్రమంలో నదులు పొంగి, విశాలంగా ఒండుమన్నుతో సమతలంగా భూమి ఏర్పడిన చోట్ల చెట్లు, మొక్కలు, పైర్లు, దుంపలూ ఏపుగా పెరగడము, పండిన తరువాత మట్టి పై రాలి మొలకెత్తి మరలా మనిషి తినగలిగిన వాటిగా తయారు కావడమూ ఒక గుంపు గమనించింది. తమకు ఆహారంగా కావలసిన మొక్కలు నీరు అందక తలలు వేలాడేస్తే దోసిళ్లతోనూ, ఆకులతోనూ, వెదురుబొంగులతోనూ, చర్మాల సంచుల తోనూ నీళ్లు పోసి రక్షించడం మనిషి నేర్చుకొన్నాడు.

Also Read: రాష్ట్రపతి శీతాకాలం విడిది వాయిదా పడినట్టేనా?

ఆ పద్ధతి వారి ఆకలిని తీర్చడంతో ఆ గుంపు ఆ చోటుకు ఇతర గుంపులూ, జంతువులూ, పక్షులూ రాకుండా “కాపు” కాయడము నేర్చుకున్నాయి. కంచెలో రాయీరప్పా వంటివో అడ్డు ఉంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని బతకడం మొదలు పెట్టారు.

ఆ పద్ధతి తెలియని ఇతర గుంపులు వీరి జీవన విధానానికి ఆశ్చర్య పోయారు. రకరకాల వాతావరణాల లోనూ, ఆహారం దొరక్క పోయి, అరణ్యాలూ, నీటిప్రవాహాల లోనూ తిరుగుతూ తమ గుంపు హరించుకు పోవడం ఇతర మనుషుల గుంపులను వేదనకు గురి చేసింది. వారిలాగా పంటలు పండించడం తెలియక పోయి (లేక వారు ఇతరులకు ఆ మర్మం చెప్పక పోయి) వీరి చుట్టూనే తచ్చాడుతూ వీరికి అవసరమైన కావచ్చు, వీరు చెప్పిన విధంగా కావచ్చు రాతి,కలప పనిముట్లు తయారు చేసి ఇవ్వడం. వీరు చెప్పిన చోట కాపలా కాయడం, చెట్ల బెరడు, జంతువుల చర్మంతో శరీర ఆచ్చాదనలు తయారు చేసి ఇవ్వడం చేస్తూ వారికి సహాయపడుతూ ఆ కాపువారి చెలిమి సంపాదించారు.(రెడ్డి, జమీందారు వంటివి కాలక్రమంలో రాచరిక వ్యవస్థ సృష్టించిన పదవుల పేర్లు మాత్రమే!!)

అందుకే పంట పండిన తరువాత కల్లంలో కాపువాడు 12 మంది ఆయ గాళ్లకు(ఆయగాళ్లు అంటే కమ్మరి, కుమ్మరి,కంసాలి,చాకలి, మంగలి,చర్మకారి,తోటి, తలారి,వడ్రంగి వంటి 12 కులాల వారు (కులము అంటే గుంపు) తాను పెట్టిన పంటలు పండించడానికి తమకు తెలిసిన చేతి వృత్తులతో సహకరించి నందుకు) “మేర” ఇచ్చేవాడు.(మేర అంటే…కల్లంలోని ధాన్యాన్ని ఒక మేర ఒక్కో ఆయగానికి వదిలి వేయడం)

ఫ్రెంచి విప్లవంతో యంత్రాలు, విద్యుత్తు రంగ ప్రవేశం చేసేవరకూ, నాణ్యాల రూపంలో ధనం ప్రవేశించేదాకా ఒక పచ్చని చెట్టుకు తల్లి వేరు కాపువాడు(రైతు) అయితే ఇతర వృత్తుల వారు పిల్ల వేర్లుగా ఆ తల్లివేరు చుట్టూ అల్లిబిల్లిగా అల్లుకొని జీవనం సాగేది. అప్పుడు రైతే రాజు!!

Also Read: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ ఎప్పుడంటే..?

ఈ గుంపుల బతుకులను(ఊరుమ్మడి బతుకుల్ని) రక్షిస్తామనే నెపంతో రాచరిక వ్యవస్త వచ్చింది.  రాజులూ, చక్రవర్తులు అంటే పగటి దొంగలు మాత్రమే!! మంత్రులూ, పురోహితులూ ఈ దోపిడీగాళ్లకు మోసాల ఎత్తుగడలు నేర్పే దగుల్బాజీలు!!

యంత్రాలు, డబ్బూ రంగప్రవేశం చేశాక చేతివృత్తుల పరికరాలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లోకి కర్మాగారాల రూపంలో బదిలీ అయ్యాయి. కులవృత్తుల్ని నమ్ముకొని బతికేవారు పనుల్లేక కకావికలై గ్రామాలు వదిలి బతుకుతెరువుల వెంట సాగిపోయారు.

ఇప్పుడు రైతు గతంలోలా పచ్చని చెట్టుకాదు. కొత్త వంగడాల పేరుతోనూ, క్రిమిసంహారక మదుల ముసుగులోనూ, గిట్టుబాటు ధర పేరుతోనూ ఎందరో పరాన్న జీవులు బతకడానికి బలి పశువుగా మారి….. వేర్లు, కొమ్మలూ ఉత్తరించబడిన మోడు. డబ్బుల సంపాదనా కిలాడీగాల్లందరూ నీటిపట్టున చేరి ఆడించే రకరకాల చట్టాల ఆటలో పావుగా మారిన అసహాయ జీవి. ఇప్పుడు రైతు రాజు కాదు ఏ బతకనేర్చిన తనమూ తెలియక మట్టి పురుగ్గా మిగిలిన అవశేషం!!

ఇప్పటి వ్యవస్తను పూర్తిగా మార్చి సరికొత్త విధానాన్ని రైతు కేంద్రకంగా తయారు చేస్తేకానీ ఎవ్వరూ వ్యవసాయం చెయ్యరు. తినడానికి గింజలు పండవు. అప్పుడు ఈ కరెన్సీ కట్టలగాళ్ళంతా పురుగులుగా మారి ఆ కాగితాల్నే తిని బతకాల్సిన దుస్థితి దాపురిస్తుంది.

-సడ్లపల్లె

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular