ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా ఆదివారం ప్రవేశ పెట్టె బడ్జెట్ రూ 1.55 లక్షల కోట్ల మేరకు ఉండగలదని భావిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలకు శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఆమోదం తెలుపనుంది.
మాంద్యం వెంటాడుతున్నా గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా ఈసారి పది శాతం అదనంగా పద్దు ఉండగలదని చెబుతున్నారు. గత బడ్జెట్ల తరహాలోనే ఈ యేటి పద్దు కూడా రైతు పక్షపాతిగానే ఉండే అవకాశం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతుబంధు, బీమా, అగ్రి సబ్సిడీలు, ఇతరత్రా అన్ని రకాల కేటాయింపులు బడ్జెట్లో 20 శాతానికిపైగా ఉండనున్నట్టు తెలిసింది.
57 ఏళ్ల వారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పింఛన్లకు రూ.10 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నాయి. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ.7 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని సమాచారం. కరెంట్ సబ్సిడీలు, ఇతర కేటాయింపులకు రూ.10 వేల కోట్ల వరకు ఇచ్చే అవకాశముంది.
రైతు రుణాలు త్వరలోనే మాఫీ చేయనున్నామని మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెపుతున్న నేపథ్యంలో రుణమాఫీకి రూ.6 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నట్టు తెలుస్తోంది.
2019–20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,43,133 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతకుముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూ.1,82,017 కోట్లతో పెట్టింది. ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతను సాకుగా చూపి వాస్తవ బడ్జెట్కు వచ్చే సరికి రూ.38,884 కోట్ల మేర కోత పెట్టింది.
రాష్ట్ర వృద్ధి రేటు 17% నుంచి ఆరు శాతానికి పడిపోయినా, ఈ ఏడాది రూ.70 వేల కోట్ల వరకు స్టేట్ ఓన్ రెవెన్యూ ఉండే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాల్లో ఒక శాతం మేర కోత పెడుతూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2020–21 కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రూ.29,030.58 కోట్లు కేటాయించారు.
సెంట్రల్ జీఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కం ట్యాక్స్, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ రూపేణ ఈ ఆదాయం రాష్ట్రానికి సమకూరనుంది. పన్నుల్లో వాటా ఒక శాతం తగ్గినా 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.739 కోట్ల మేర పెరగడం గమనార్హం.