దేశంలో కరోనా కల్లోలం ఊహకందని విధంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ.. లక్షలాదిగా కేసులు, వేలాదిగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. అదేవిధంగా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. తాజాగా.. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కూడా ప్రభుత్వ ప్రచారంలో భాగమయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రూపొందించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని చాలా ఇబ్బంది పెడుతోంది. గతేడాదిలో మనం ఎంతో కష్టపడ్డాం. ఇక, అందులోంచి బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. నిత్యం లక్షలాది మంది వైరస్ కు ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కానీ.. జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు’’అని తెలిపారు విజయ్.
‘మనలో కరోనా లక్షణాలు కనిపించగానే చికిత్సకు సిద్ధమవ్వాలి. మీకు జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయంటే.. ఖచ్చితంగా కరోనా అయి ఉంటుందని భావించాలి. వెంటనే.. డాక్టరు వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఏ లక్షణాలు కనిపించినా.. కరోనా నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకోండి.’ అని సూచించారు.
‘కరోనా వచ్చిన వారికి అన్నింటికన్నా టైం ప్రధానమైంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో డాక్టర్లను అందుబాటులో పెట్టింది. మీరు వాళ్లతో మాట్లాడండి. మీరు ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లినా.. కిట్ రూపంలో మందులు ఇస్తారు. వాటిని వేసుకుంటే సరిపోతుంది. భయపడకండి. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ చెప్పారు విజయ్ దేవరకొండ.