Unknown Gunmen In Pakistan: ఎవరో వస్తున్నారు.. అందరూ చూస్తుండగానే కాల్చి చంపేసి వెళ్తున్నారు. క్షణంలోనే ఇదంతా జరిగిపోతోంది. చనిపోయిన వాళ్ళు అమాయకులు కాదు. గొప్ప గొప్ప మేధావులు అంతకంటే కాదు. వారంతా ఉగ్రవాదులు. వారి నర నరాన ఉగ్రవాదాన్ని జీర్ణించుకున్నవారు.. చాందస తత్వాన్ని ఒంట పట్టించుకున్న వారు.. విద్రోహ చర్యలకు పాల్పడుతూ.. భారతదేశంలో అశాంతిని కలుగజేసిన ముష్కరులు.. అటువంటివారు ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు.
తదేగా పాకిస్తాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన కో ఫౌండర్ అమీర్ హంజా పై పాకిస్తాన్లో కాల్పులు జరిగాయి. దీంతో అతడు కన్నుమూశాడని వార్తలు వచ్చాయి. తీవ్రంగా గాయాలు కావడంతో.. అతడిని ఎక్కడికి తీసుకెళ్లారు.. అతడు ఏమైపోయాడు అనే అంశాలపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.. కాకపోతే పాకిస్తాన్లో అమీర్ చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. అతనికి అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. పేరు మోసిన ఉగ్రవాద సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్న అతడు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తలదాచుకోవడం భారత ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. పాకిస్తాన్లో ప్రపంచంలో అత్యంత తీవ్రమైన ఉగ్రవాద సంస్థలకు నాయకత్వం వహిస్తున్నవారు నివాసం ఉంటున్నారు. అనేక ఆధారాలతో భారత్ దీనిని నిరూపించినప్పటికీ అమెరికా, చైనా మోకాలడ్డుతున్నాయి.
పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులు ఇటీవల కాలంలో వరుసగా కన్నుమూస్తున్నారు. మూడు సంవత్సరాలుగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్ బుల్ ముజాహిద్ వంటి ప్రమాదకరమైన గ్రూపులకు సంబంధించిన ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్ లో మట్టుపెట్టారు.. జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూపుకు చెందిన మహమ్మద్ తాహిర్ అన్వర్, లష్కరే తోయిబా ఉగ్రవాద గ్రూప్నకు చెందిన ఖతల్, కలుస్తాను కమాండో ఫోర్స్ చీఫ్ పరంజిత్ సింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది పాకిస్థాన్ లో కాలగర్భంలో కలిసిపోయారు. ప్రమాదకరమైన ఉగ్రవాదులను అజ్ఞాత వ్యక్తులు చంపుతున్న తీరు చూస్తుంటే అది ముమ్మాటికి దురంధర్ సినిమాను గుర్తు చేస్తోంది. ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు? వారి వెనుక ఉన్నది ఎవరు? పాకిస్తాన్లో ఎలా ప్రవేశించారు? ఉగ్రవాదులను ఎలా చంపుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దాని వెనుక ఉన్నది ఎవరనే విషయాన్ని ప్రముఖంగా వివరించాల్సిన పని కూడా లేదు.
ఉగ్రవాదులను ఇలా ఏరి వేయడం వల్ల భారత్ ఊపిరి పీల్చుకుంటున్నది. గతంతో పోల్కి చూస్తే ఉగ్రవాదుల రాకపోకలు తగ్గిపోయాయి. సరిహద్దుల్లో భారత్ అత్యంత కట్టుదిట్టంగా పహారా కాస్తోంది. ఉగ్రవాదుల అలికిడి కనిపిస్తే చాలు మన సైన్యం దాడులు చేస్తోంది. ఏకపక్షంగా దూసుకుపోయి.. మరోసారి భారత్ మీద దాడి చేయాలని ఆలోచనను తుంచేస్తోంది.. ఒకప్పటి మాదిరిగా పాకిస్తాన్ దేశానికి భారత్ భయపడడం లేదు. చర్చల పేరుతో కాలయాపన చేయడం లేదు. గన్నుకు గన్ను.. తూటాకు తూటా.. ప్రాణానికి పదులకొద్ది ప్రాణాలు అనే సూత్రాన్ని అమలు చేస్తోంది. అందువల్లే ఉగ్రవాదుల అసలు రంగు బయటపడుతోంది.